కాబూల్‌లో రాకెట్ల వర్షం: 8మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్‌ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం

Updated : 21 Nov 2020 13:38 IST

(ప్రతీకాత్మక చిత్రం)

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్‌ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 20కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు, వ్యాపార సమూహాలు, అంతర్జాతీయ కంపెనీలు ఉన్న గ్రీన్‌జోన్‌కు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడంతో అఫ్గాన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాకెట్ల దాడిలో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. ఖతార్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, తాలిబన్‌ మధ్య నేడు చర్చలు జరగనున్న కొద్ది గంటల ముందే కాబూల్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. కాగా.. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌ ప్రకటించింది. 

అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ మధ్య ఈ ఏడాది సెప్టెంబరులో శాంతి చర్చలు ప్రారంభమవగా.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనబడలేదు. ఓ వైపు చర్చలు జరుపుతూ మరోవైపు పేలుళ్లకు పాల్పడుతోంది. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. ఆసియా దేశాల పర్యటనలో ఉన్న మైక్‌ పాంపియో.. నేడు ఖతార్‌లో పర్యటిస్తున్నారు. తాలిబన్‌, అఫ్గాన్‌ ప్రభుత్వంతో పాంపియో కీలక చర్చలు జరపనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని