బ్లింకెన్‌.. మన మిత్రుడే!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ఎంపిక చేశారు. ఈ శాఖలో బ్లింకెన్‌కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. బైడెన్‌తోనూ చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి........

Published : 25 Nov 2020 01:44 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ఎంపిక చేశారు. ఈ శాఖలో బ్లింకెన్‌కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. బైడెన్‌తోనూ చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యూఎస్‌ నావల్‌ అబ్జర్వేటరీ రెసిడెంట్‌గా బైడెన్‌ వ్యవహరిస్తున్న సమయంలో బ్లింకెన్‌ ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా బైడెన్‌ ఉన్నప్పుడు అందులో బ్లింకెన్‌ స్టాఫ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. 2013-17 మధ్య జాన్‌ కెర్రీ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో బ్లింకెన్‌ డిప్యూటీ సెక్రెటరీగా వ్యవహరించారు. మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు స్పీచ్‌ రైటర్‌గా బ్లింకెన్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించడం విశేషం. ఇక ఆయన తండ్రికి హంగేరీలో అమెరికా రాయబారిగా పనిచేసిన అనుభవం ఉంది. 

భారత్‌తో అణు ఒప్పందంలో కీలక పాత్ర..

ఇలా విదేశాంగ శాఖలో అనుభవం గడించిన బ్లింకెన్‌.. బైడెన్‌ విదేశాంగ విధానాన్నిరూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమాసియా, చైనా, ఐరోపా, ఇరాన్‌, భారత్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలన్న విషయంపై బైడెన్‌ ఆలోచనలకు ఓ రూపునిచ్చారు. ఒబామా హయాంలో బారత్‌-అమెరికా మధ్య కుదిరిన అణు ఒప్పందం సమయంలో సొంత పార్టీ డెమొక్రాటిక్‌ సభ్యుల నుంచే భిన్నస్వరాలు వినిపించాయి. ఆ సమయంలో వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో బ్లింకెన్‌ కీలక పాత్ర పోషించారు.

భారత్‌ లేకుండా కష్టం..

భారత్‌తో సంబంధాలపై బ్లింకెన్‌ పలు సందర్భాల్లో ఆయన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. గత వేసవిలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌తో బైడెన్‌ బంధం ఎలా ఉండనుందో వివరించారు. ‘‘భారత్‌తో సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికి బైడెన్‌ చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భవిష్యత్తుకు ఇది ఎంతో అవసరం. ప్యారిస్‌ ఒప్పందంలోకి భారత్‌ను తీసుకురావడంలో బైడెన్ యంత్రాంగం విశేష కృషి చేసింది. భారత్‌ చేరకపోయి ఉంటే ఆ ఒప్పందానికి అర్థమే ఉండేది కాదు. భారత్‌ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం చూపడం అంత సులువు కాదు’’ అని భారత్‌పై బైడెన్‌ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. 

చైనా.. ఉమ్మడి ముప్పు..

దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాతో ఇటు భారత్‌ అటు అమెరికా ఇరు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బ్లింకెన్‌ ఓ సందర్భంలో తెలిపారు. సరిహద్దులో దురాక్రమణతో భారత్‌పై ఒత్తిడి తెస్తే.. ఉత్పత్తి రంగంలో ఉన్న సానుకూలతలతో అమెరికాను చైనా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ నిబంధనలకు తూట్లు పొడుస్తూ లబ్ధి పొందేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తోందన్నారు. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌-అమెరికా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 15న భారతీయ-అమెరికన్లు నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యూహాత్మక పరిధిని దాటాలి..

అంతర్జాతీయంగా భారత పాత్రను పటిష్ఠం చేయడంలో అమెరికా సహకారం కొనసాగుతుందని బ్లింకెన్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు స్థానం కల్పించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. భారత్‌-అమెరికా మధ్య బంధం వ్యూహాత్మక పరిధిని దాటాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని