ఉపాధి హామీ పనిదినాలు పెంచనున్న కేంద్రం!

కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి భారీ సంఖ్యలో రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలు కావడంతో...

Published : 12 Oct 2020 01:02 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి..

దిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలవడంతో సగటు ఆదాయం పడిపోయింది. ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లక్ష్యాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి పనిదినాలను పెంచడం గమనార్హం. దేశ జనాభాలోని ప్రతి ఐదుగురిలో ఒకరి పేరు ఉపాధి పథకంలో నమోదు చేయించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. గత మేలో ఉపాధి హామీ పథకంలోకి రూ.40వేల కోట్లను అదనంగా కేటాయించింది. ఒక్కో వ్యక్తికి 281 నుంచి 300 పనిదినాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో 320 కోట్ల పనిదినాలను కల్పించాలని కేంద్రం భావిస్తోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. తొలిసారి అంచనా వేసిన పనిదినాల కంటే 40 కోట్ల పనిదినాలు అధికం కావడం విశేషం. అలాగే ఉపాధి హామీ వేతనాలను కూడా కేంద్రం పెంచింది.

ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా ఎనిమిది పెద్ద రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్‌ ఏడు నాటికి 221.9 కోట్ల పనిదినాలను కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. గత నెల 5 వరకు రూ.65 వేల కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది మే నెలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం మే వరకు ప్రతి నెలలోనూ అధికంగానే పనిదినాలను కల్పించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా దెబ్బకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం దిగజారిన విషయం తెలిసిందే. నిరుద్యోగం పెరగడం, వేతనాల కోత వంటి కారణాలతో రాబోయే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురు దెబ్బ తప్పదేమోనని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో దేశం ఘోరమైన ఆర్థిక మాంద్యం చూసే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) అంచనా వేయడం కూడా ఆందోళనలను మరింత పెంచిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు