భారత్‌లో రికవరీ రేటు.. ఏ రాష్ట్రంలో ఎంత? 

కరోనా బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62,282 మంది డిశ్చార్జి అయ్యారు......

Published : 21 Aug 2020 16:40 IST

దిల్లీ: కరోనా బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62,282 మంది డిశ్చార్జి అయ్యారు. 24గంటల సమయంలో ఇంతమంది కోలుకొని డిశ్చార్జి కావడం ఇదే తొలిసారి. తాజా గణాంకాలతో భారత్‌లో కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 21,58,946కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు, యాక్టివ్‌ కేసులు, మరణాల రేటు కూడా తగ్గుతోంది. దేశంలో  ప్రస్తుతం రికవరీ రేటు 74.3%  కాగా; మరణాల రేటు 1.9%గా ఉంది. 

10 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువే..

జూన్‌ 17 నాటికి రికవరీ రేటు 52.8%  ఉండగా.. జులై 16 నాటికి  అది 63.24%నికి పెరిగింది. తాజాగా మరింత మెరుగుపడి 74.3%గా నమోదైంది.  కోలుకున్నవారి విషయంలో జాతీయ సగటు 74.3%  కాగా.. పది రాష్ట్రాల్లో మాత్రం రికవరీ రేటు అంతకన్నా మెరుగ్గా ఉన్నట్టు కేంద్రం తెలిపింది.  దిల్లీలో అత్యధికంగా 90.10శాతం ఉంది. 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 50శాతానికి పైగా రికవరీ రేటు నమోదైనట్టు వెల్లడించింది.

తెలంగాణ 5.. ఏపీ 12..

కరోనా రోగుల రికవరీ విషయంలో తెలంగాణ 77.4శాతంతో ఐదో స్థానంలో ఉంది. అంతకన్నా ముందు హరియాణా 84.5%, తమిళనాడు 83.50%, గుజరాత్‌ 79.4%తో ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ 72.3 రికవరీ శాతంతో 12వ స్థానంలో కొనసాగుతోంది.

భారత్‌లో నిన్న ఒక్కరోజే 68,898 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,05,823కి పెరిగింది. వీరిలో 21.5లక్షల మందికి పైగా కోలుకోగా.. 54,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,92,028 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని