కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం

కుటుంబనియంత్రణ పాటించమని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలపై నిబంధనలు పెడితే జనాభా వక్రీకరణకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు జనాభా నియంత్రణపై

Updated : 12 Dec 2020 15:22 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: కుటుంబనియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంతానంపై నిబంధనలు పెడితే ప్రజానీకంలో తీవ్ర నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై  కేంద్రం న్యాయస్థానానికి తమ అఫిడవిట్‌ సమర్పించింది. 

దేశంలో కుటుంబ సంక్షేమ పథకం స్వచ్ఛందమైనదని కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. తమకు ఎంతమంది పిల్లలు కావాలో అది పూర్తిగా దంపతుల ఇష్టమేనని, కుటుంబనియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. కుటుంబ నియంత్రణపై బలవంతపు చర్యలను భారత్‌ నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. ఒకవేళ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని ప్రజలను బలవంతపెడితే అది ప్రజల నుంచి నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ అనుభవాలు కూడా ఇవే చెబుతున్నాయని తెలిపింది.  

అయితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2000 సంవత్సరంలో జాతీయ జనాభా విధానాన్ని(ఎన్‌పీపీ) అవలంబించిన సమయంలో సంతానోత్పత్తి రేటు 3.2శాతంగా ఉండగా.. 2018 నాటికి అది 2.2శాతానికి తగ్గిందని పేర్కొంది. 2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1శాతంగా ఉండేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపింది. 

దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేలా, ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలంటూ భాజపా నేత, న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌లో వేశారు. జనాభా పెరుగుదలతో కాలుష్యం, నిరుద్యోగం పెరుగుతోందని, కనీస అవసరాలు అందరికీ చేరలేకపోతున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. అంతేగాక, అవినీతికి కూడా జనాభా పెరుగుదల మూలంగా మారుతోందని ఆరోపించారు. అయితే ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. జనాభా నియంత్రణపై చట్టాలు చేసేది పార్లమెంట్‌, రాష్ట్ర ప్రభుత్వాలేనని, కోర్టులు కాదని న్యాయస్థానం తెలిపింది. దీంతో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఇవీ చదవండి..

రైతుల ఆదాయాన్ని పెంచేందుకే కొత్త చట్టాలు

టీనేజర్లను అర్థం చేసుకోండిలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని