బిన్‌ లాడెన్‌ను అలా మట్టుబెట్టాం: ఒబామా

అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. పాక్‌ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్‌,

Published : 17 Nov 2020 17:09 IST

2011 నాటి కమాండో ఆపరేషన్‌ను గుర్తుచేసుకున్న మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. పాక్‌ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్‌, అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమే అని, అలాంటప్పుడు పాక్‌ నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఒబామా అభిప్రాయపడ్డారు. ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. ఇందులో బిన్‌ లాడెన్‌ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్‌ ఆపరేషన్‌ గురించి సవివరంగా ప్రస్తావించారు. ఆ ఆపరేషన్‌ గురించి ఆయన మాటల్లోనే..

‘అబొట్టాబాద్‌లోని పాకిస్థానీ మిలిటరీ కంటోన్మెంట్‌ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. లాడెన్‌పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలనిపించి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టాం. ఎలాంటి దాడి చేయగలమని నేను టామ్‌ డోనిలన్‌(అప్పటి జాతీయ భద్రతా సలహాదారు), జాన్‌ బ్రెన్నన్‌(అప్పటి సీఐఏ అధికారి)లను అడిగాను. అయితే లాడెన్‌పై మేం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని గోప్యంగా ఉంచడం మా ముందున్న సవాల్‌. ఎందుకంటే దీనిపై చిన్న సమాచారం లీకైనా గొప్ప అవకాశాన్ని కోల్పోతామని మాకు తెలుసు. అందుకే కేవలం ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మందికి మాత్రమే ఈ రహస్య ఆపరేషన్‌ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.’

‘ఇక మాకున్న మరో అడ్డంకి పాకిస్థాన్‌. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నప్పటికీ.. పాక్‌ మిలిటరీలో కొన్ని అంతర్గత శక్తులకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌కు తాలిబన్‌, అల్‌ఖైదా ఉగ్రముఠాలతో సంబంధాలున్నాయన్నది బహిరంగరహస్యమే. కొన్ని సార్లు ఈ ముఠాలను ఆ దేశం భారత్‌, అఫ్గానిస్థాన్‌పై వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరో విషయమేంటంటే.. బిన్‌లాడెన్‌ దాక్కున్న కాంపౌండ్‌ పాక్‌ మిలిటరీ కంటోన్మెంట్‌కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్‌ గురించి పాకిస్థానీలకు ఏదైనా చెబితే లాడెన్‌కు సమాచారం అందే అవకాశం ఉంది. అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వాములను చేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాం.’

‘సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా మా ముందున్న రెండు అవకాశాల గురించి చర్చించుకున్నాం. మొదటిది.. లాడెన్‌ ఉన్న కాంపౌండ్‌ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. రెండవది.. ప్రత్యేక కమాండో ఆపరేషన్‌. ఇందులో కొంతమంది కమాండోలు హెలికాప్టర్‌ ద్వారా పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించి,  దాడి చేసి, ఆ దేశ పోలీసులు, మిలిటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగి రావాలి. రిస్క్‌ ఉన్నప్పటికీ నేను, జాతీయ భద్రతా బృందం రెండో అవకాశాన్ని ఎంచుకున్నాం. అయితే ఈ ఆపరేషన్‌ను ఆమోదించడానికి ఒకరోజు ముందు  మీటింగ్‌లో హిల్లరీ క్లింటన్‌(అప్పటి విదేశాంగ మంత్రి) మాట్లాడుతూ.. ఈ ఆప్షన్‌ 51-49 శాతం పనిచేస్తుందని అన్నారు. రక్షణ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌ కమాండో ఆపరేషన్‌ను వ్యతిరేకించి వైమానిక దాడులను పరిశీలిద్దామని చెప్పారు. ఇక ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ కూడా వ్యతిరేకించారు. ఆపరేషన్‌ విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరకు నిఘా వర్గాల నుంచి అత్యంత స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని ఆపరేషన్‌ చేపట్టాం.’

‘కమాండో ఆపరేషన్‌ విజయవంతమైన తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ నుంచి ఫోన్‌ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదని భావించా. అనుకున్నట్లే ఆయన నుంచి కాల్‌ వచ్చింది. అయితే ఆపరేషన్‌పై ఆయన అభినందనలు తెలపడమేగాక, మద్దతు ప్రకటించడం సంతోషంగా అనిపించింది. లాడెన్‌ను మట్టుబెట్టడం మంచి విషయం అని జర్దారీ అన్నారు. తన భార్య బెనజీర్‌ భుట్టో ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురవడాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు’ అంటూ ఒబామా ఆనాటి ఘటనలను పుస్తకంలో రాసుకొచ్చారు. 

అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూల్చి దాదాపు 3000 మందిని పొట్టనబెట్టుకున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. అబొట్టాబాద్‌ కంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి మట్టుబెట్టింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని