చైనాకు మరోషాక్‌.. పబ్జీపై కేంద్రం నిషేధం

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై .........

Updated : 02 Sep 2020 18:11 IST

దిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో తాజాగా చోటుచేసున్న ఉద్రిక్తతల నేపథ్యంలో  దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో మరికొన్ని చైనా యాప్‌లపైనా కేంద్రం వేటు వేసింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలపై లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు తమ సమాచారాన్ని అనధికారికంగా సేకరించి దేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా చేరవేస్తున్నట్టు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

పబ్జీకి ఎందుకంత క్రేజ్‌..
పోరాటాల ఆటలంటే ఇష్టపడేవారికి పబ్జీ ఓ విందు భోజనంలా ఉంటుంది. ఇందులో వంద మంది కలసి ఓ ప్రాంతంలో దిగి... తుపాకీలతో పోరాడి చివరికి నిలిచేవాడు విజేత అవుతాడు. బృందంతో ఆడితే బృందం విజేతగా నిలుస్తుంది. గెలిచినవారికి చికెన్‌ డిన్నర్‌ లభిస్తుంది. అంటే అదేదో గిఫ్ట్‌ అనుకోవడానికి వీల్లేదు.. ‘విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌’ అనే ఓ పోస్టర్‌ పడుతుంది. గన్‌లు, బాంబులు, కార్లు, బైక్‌లు, ఛేజింగ్‌లు, ఫైరింగ్‌ లాంటివి ఉండటంతో ఈ ఆట అంటే యువత తెగ ఇష్టపడుతుంది. దీనికోసమే స్మార్ట్‌ ఫోన్లు కొనుకున్న యువత కూడా ఉన్నారని ఇటీవల వార్తలు కూడా చదివాం. 
తొలుత ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట... ఫిబ్రవరి 9, 2018న మొబైల్‌ వెర్షన్‌లో మన దేశంలో లాంచ్‌ చేశారు. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్‌లో ఉత్తమ యాప్‌గా నిలిచింది. ఆ తర్వాత లో ఎండ్‌ మొబైల్స్‌ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

పబ్జీకి ప్రపంచంలోనే కాదు భారత్‌లోనూ విశేష ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత ఈ ఆటపట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ ఆటలోనే మునిగిపోతారు. ఒక్క భారత్‌లోనే 50మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నాయంటే పబ్జీకి ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నెలలపాటు ఈ ఆడటం కోసం నిద్రాహారాలు మాని అనేకమంది ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పబ్జీ గేమ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా బ్రెండన్‌ గ్రీన్‌, జాంగ్‌ టె-సియాక్‌ ఉన్నారు. 2000 సంవత్సరంలో జపనీస్‌ చిత్రం బ్యాటిల్‌ రాయల్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.

కేంద్రం నిషేధించిన 118 మొబైల్‌ యాప్‌లు ఇవే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని