కొవిడ్‌ రోగుల ఆందోళన..రహదారి దిగ్బంధం..! 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో ఆసుపత్రులు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొన్నిచోట్ల బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారుతోంది. దీనిలో భాగంగా కరోనా సోకిన బాధితులు తమకు కనీసం నీరు, ఆహారం కల్పించాలంటూ రోడ్లపైకి వచ్చిన ఘటన తాజాగా అసోంలో చోటుచేసుకుంది. దాదాపు 100మంది కొవిడ్‌ రోగులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో అధికారులు కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Published : 18 Jul 2020 00:03 IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్లో వసతులపై ఆగ్రహం
అసోంలో ఘటన

గువహటి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో ఆసుపత్రులు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొన్నిచోట్ల బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారుతోంది. దీనిలో భాగంగా కరోనా సోకిన బాధితులు తమకు కనీసం నీరు, ఆహారం కల్పించాలంటూ రోడ్లపైకి వచ్చిన ఘటన తాజాగా అసోంలో చోటుచేసుకుంది. దాదాపు 100మంది కొవిడ్‌ రోగులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో అధికారులు కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసోంలోని కామ్రూప్ జిల్లాలో కరోనా రోగులకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజులుగా అక్కడ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వారినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోపోద్రిక్తులైన 100 మంది కరోనా రోగులు, ఏకంగా ఆసుపత్రి బయటకు దూసుకొచ్చారు. అక్కడే జాతీయ రహదారిని దిగ్బంధించారు. కనీసం ఆహారం, మంచినీరు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వంద మంది కరోనా రోగులు అనూహ్యంగా రోడ్డుమీదకు రావడంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకొని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడి సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోకి వెళ్లినట్లు జిల్లా పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

అయితే, దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో సేవలందించే ఆరోగ్య కార్యకర్తలు రాత్రి, పగలు పనిచేస్తుండడంతో ఒత్తిడి పెరిగిందని, అందుకే ఒక్కోసారి ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆ కేంద్రంలో సదుపాయాలు నచ్చకపోతే సొంత ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలని కరోనా బాధితులకు సూచించడం గమనార్హం.

ఇదిలాఉంటే, అసోంలో ఇప్పటివరకు 19,754 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 48మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 10లక్షలు దాటిన కరోనా కేసులు
తొలి లక్ష@100 రోజులు, 9 లక్షలు@59 రోజులే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని