భారత్‌: 24గంటల్లో 803 మంది మృతి!

దేశంలో నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 803 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 38,938కి చేరింది.

Updated : 04 Aug 2020 10:58 IST

దేశంలో 39వేలకు చేరువలో కొవిడ్‌ మరణాలు
ఇప్పటికే కోలుకున్న 12లక్షల మంది కరోనా బాధితులు

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా రికార్డుస్థాయిలో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 803 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 38,938కి చేరింది. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 52,050 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 18,55,745గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 12లక్షల 30వేల మంది కోలుకోగా మరో 5లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 44వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 65.77శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.11శాతంగా ఉంది.

ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,700 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. నిత్యం అక్కడ 250కిపైగా కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు, దిల్లీలలో ఇప్పటివరకూ 4వేల చొప్పున కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 2500చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో కొవిడ్‌ కేసుల్లో భారత్‌ మూడోస్థానంలో ఉండగా, మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఇవీ చదవండి..
తెలంగాణ: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి!
గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని