భారత్‌లో ఒక్కరోజే 1007 మంది మృత్యువాత!

భారత్‌లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1007మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వెయ్యిమంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 10 Aug 2020 10:23 IST

24గంటల్లో 62వేల కరోనా కేసులు
దేశంలో 22లక్షల కేసులు, 44వేలు దాటిన మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా నిత్యం రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1007మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వెయ్యిమంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల మరణాల రేటు 2శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. భారత్‌లో వరుసగా నాలుగోరోజు 60వేల కేసులు బయటపడ్డాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 15లక్షల 35వేల మంది కోలుకోగా మరో 6లక్షల 34వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 54వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69శాతానికి చేరింది.

ఇదిలాఉంటే, కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్‌, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే లక్షా 62వేల మంది ప్రాణాలు కోల్పోగా బ్రెజిల్‌లో లక్ష మంది చనిపోయారు. భారత్‌లో కొవిడ్‌ మృతుల సంఖ్య 44వేలు దాటింది.

ఇవీ చదవండి..
భారత్‌లో కరోనా: రికవరీ @15 లక్షలు
అత్యుత్తమ నాణ్యతతోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని