
రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు: సోనియా
దిల్లీ: ఇటీవల అమలులోకి వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీటిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నేడు మహాత్మా గాంధీ, దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా సోనియా ఇరువురు నేతలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రకటనలో.. భారతదేశ ఆత్మ పల్లెల్లోనే ఉంటుందని అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అని నినదించారని ఆమె గుర్తుచేశారు.
భూసేకరణ చట్టాల మాదిరిగానే ఈ క్రూర చట్టాలు కూడా నిర్వీర్యమయ్యే దాకా తాము రైతుల పక్షాన నిలిచి పోరాడతామని సోనియా స్పష్టంచేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో పేదలకు నిత్యావసరాలు సరఫరా చేయగలగటం రైతుల చలవే అని.. అయితే ప్రస్తుత ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తూ, రైతులను వారి పొలాల్లోనే కూలీలను చేసేందుకు కంకణం కట్టుకుందని ఆమె మండిపడ్డారు. కాగా, నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను చేపట్టింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పంజాబ్లో అక్టోబర్ 3 నుంచి 5 వరకు ట్రాక్టర్ ప్రదర్శనలను నిర్వహించనున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.