మరో నాలుగేళ్లు మనమే: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీల ప్రచారం ఊపందుకుంది.  ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం మిచిగాన్‌లో ఏర్పాటు చేసి ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో....

Published : 18 Oct 2020 11:16 IST

మిచిగాన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో శనివారం మిచిగాన్‌లో ఏర్పాటు చేసి ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగానే ప్రజలకు ఎల్లప్పుడూ రిపబ్లికన్‌ పార్టీనే గెలిపించాలని ఆకాంక్షించారు.

‘‘తాజా ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఎన్నికల్లో విజయం మనదేనని బలంగా నమ్ముతున్నాను. మరో నాలుగేళ్లు రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉండటం ఖాయం. భవిష్యత్‌లోనూ ప్రజలు ఇదే పంథాను కొనసాగించాలి. రిపబ్లికన్‌ పార్టీకి విజయం అందించాలి’’ అని ట్రంప్‌ అన్నారు. దీంతో అక్కడి వారంతా ‘‘మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు’’ అంటూ నినాదాలు చేశారు. తాజా ఎన్నికలలు అమెరికా చరిత్రలోనే అంత్యంత కీలకమైనవని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా పని చేస్తున్నామన్నారు. అమెరికా ప్రజల అండదండలతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగిందని, రిపబ్లికన్‌ పార్టీకి మరోసారి అధికారమిచ్చి మున్ముందు కూడా దేశానికి మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ట్రంప్‌ కోరారు.

మరోవైపు అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ మధ్య అక్టోబర్‌ 15న జరగాల్సిన రెండో ముఖాముఖి రద్దయిన విషయం తెలిసిందే. ట్రంప్‌నకు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన శ్వేతసౌధానికే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో డిబేట్ కమిషన్‌ ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ట్రంప్‌ దీనిని వ్యతిరేకించడంతో ఆ డిబేట్‌ను రద్దు చేశారు. తాజాగా వచ్చే వారంలో బెల్మాంట్ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని