
టర్కీ, గ్రీస్లో భారీ భూకంపం
ఇస్తాంబుల్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపం ధాటికి ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా.. 400 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు అమెరికా జియోలాజిక్ సర్వే పేర్కొంది.
ముఖ్యంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. భూంకంపం కారణంగా సంభవించిన చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం లేదని ఇజ్మిర్ గవర్నర్ తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని ఇస్తాంబుల్ గవర్నర్ పేర్కొన్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. గ్రీస్కు చెందిన ద్వీపం సామోస్లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.