
ప్రతి కరోనా మరణం నన్ను బాధించింది!
పంజాబ్లో వీకెండ్ లాక్డౌన్ మళ్లీ పొడిగింపు!
చండీగఢ్: రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ పంజాబ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. నగరాలు/ పట్టణాల్లో వారాంతపు లాక్డౌన్ను మళ్లీ పొడిగించింది. అలాగే, రాత్రి 7గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా కరోనాను ఎదుర్కొనేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 921మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రతి మరణమూ తనను బాధించిందన్నారు.
రాష్ట్రంలోని 167 నగరాలు, పట్టణాల్లో వీకెండ్ లాక్డౌన్ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తంచేసిన అమరీందర్ సింగ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రవాణాపైనా ఆంక్షలు విధించింది. వివాహాలు, అంత్యక్రియలు మినహా అన్ని సామూహిక కార్యక్రమాలపైనా నిషేధం విధించింది. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో ఈ నెలాఖరు వరకు నిర్వహించవచ్చని సీఎంవో తెలిపింది.
పంజాబ్లో ఇప్పటివరకు 36,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,703 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 921మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,460 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పంజాబ్లో రికవరీ రేటు 63శాతంగా ఉండగా.. మరణాల రేటు 2.6 శాతంగా ఉంది.