ఇక ఇంటివద్దే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష‌!

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను ఇంటివద్ద స్వయంగా చేసుకునే నూతన యాంటీజెన్‌ టెస్ట్‌ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.

Published : 17 Dec 2020 01:33 IST

20 నిమిషాల్లోపే ఫలితం
ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో దాన్ని ఆదిలోనే గుర్తించడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను ఇంటివద్ద స్వయంగా చేసుకునే నూతన యాంటీజెన్‌ టెస్ట్‌ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో ఇంటివద్దే స్వయంగా కొవిడ్‌ టెస్ట్‌ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఆస్ట్రేలియా కంపెనీ ఎల్యూమ్‌ అభివృద్ధి చేసిన ఈ నూతన విధానానికి అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ‘హోమ్‌ కొవిడ్‌ టెస్ట్‌’ పేరుతో ఉన్న ఈ కిట్‌ను రెండేళ్లకు పైబడిన ఏ వ్యక్తైనా వినియోగించుకోవచ్చు. పాకెట్‌ సైజులో ఉండే ఈ కిట్‌లో స్వాబ్‌నుంచి సేకరించిన శాంపిల్‌ను అందులో పొందుపరచాలి. అనంతరం అది కరోనా వైరస్‌ ప్రోటీన్లను విశ్లేషించి.. కేవలం 20నిమిషాల్లోపే ఫలితాన్ని మన మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తుంది. 

ఈ విధానంలో కరోనా వైరస్‌ లక్షణాలున్నవారిలో పాజిటివ్‌ను 96శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుండగా, లక్షణాలు లేనివారిలో 91శాతం కచ్చితత్వంతో వైరస్‌ను గుర్తిస్తుందని ఎఫ్‌డీఏ ప్రకటించింది. అయితే, లక్షణాలున్నవారు, ఇతర టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారు మాత్రం వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ సిఫార్సు చేసింది. ఒకేసారి వినియోగించగలిగే ఈ పరికరాన్ని ఆన్‌లైన్‌, స్టోర్‌లలో దాదాపు 30డాలర్లకు విక్రయించే అవకాశాలున్నాయని ఎల్యూమ్‌ పేర్కొంది. వచ్చే నెలలో లక్షల సంఖ్యలో ఈ పరికరాలను అమెరికాకు రవాణా చేస్తున్నట్టు ఆస్ట్రేలియన్‌ కంపెనీ వెల్లడించింది. ఈ నూతన విధానం వల్ల కొవిడ్‌ టెస్టు సౌకర్యం విస్తృతంగా అందుబాటులోకి రానున్నట్లు ఎఫ్‌డీఏ అభిప్రాయపడింది. అమెరికాలో కరోనా వైరస్‌కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ కిట్‌ల వల్ల ప్రస్తుతం చేపడుతోన్న కొవిడ్‌ టెస్టులపై కాస్త భారం తగ్గనుందని తెలిపింది.

ఇక, ఇంటివద్ద సొంతంగా చేసుకునే సౌలభ్యమున్న ఇలాంటి కొవిడ్‌ టెస్టులకు ఎఫ్‌డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కానీ, ఎల్యూమ్‌ తయారుచేసిన ఈ పరికరంతో కచ్చితమైన ఫలితం రావడంతో పాటు కేవలం నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి డాక్టర్‌ ప్రిస్‌క్రిప్షన్‌ కూడా అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. ఇంటివద్దే కరోనా టెస్టు చేసుకునేందుకు వీలుగా ‘ల్యూరికా’ అనే కంపెనీకి కూడా ఎఫ్‌డీఏ గతనెలలో అనుమతి ఇచ్చింది. అయితే, కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యులు భావించి సిఫార్సు చేస్తేనే ఈ పరికరాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని కంపెనీలు సొంతంగా స్వాబ్‌ శాంపిల్‌ను సేకరించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కానీ, వీటి విశ్లేషణ కోసం మాత్రం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితం క్షణాల్లో  రావడంతో ఎల్యూమ్‌ తయారు చేసిన ఈ విధానం కొవిడ్‌ టెస్టుల్లో కీలక మైలురాయిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి..
ప్రపంచంలో పావువంతు ప్రజలకు టీకా కష్టమే..!
కొవిడ్‌ మూలాలు: జనవరిలో చైనాకు WHO నిపుణుల బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని