ఫేస్‌బుక్‌కు ఇక చివరి నోటీసులు!

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష పూరిత ప్రసంగాల విషయమై సెప్టెంబర్‌ 23లోగా విచారణకు హాజరు కావాలని భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉపాధ్యక్షడు, ఎండీ అజిత్‌ మోహన్‌కు సూచించింది.

Published : 20 Sep 2020 18:24 IST

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష పూరిత ప్రసంగాల విషయమై సెప్టెంబర్‌ 23లోగా విచారణకు హాజరు కావాలని భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్‌ మోహన్‌కు సూచించింది. ఈ మేరకు దిల్లీ శాంతి భద్రత కమిటీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘దిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాల విషయంలో ఫేస్‌బుక్‌ వ్యవహరించిన తీరుపై విచారణకు కమిటీ ముందు హాజరు కావాలని ఎండీ అజిత్‌ మోహన్‌కు చివరి సారిగా నోటీసులు జారీ చేశాం. సెప్టెంబర్‌ 23లోగా ఆయన కమిటీ ముందు హాజరు కావాలి’ అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ శాంతి భద్రతల కమిటీకి ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా నేతృత్వం వహిస్తున్నారు. 

దేశ రాజధానిలో అల్లర్ల సమయంలో ఫేస్‌బుక్‌ చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపిస్తూ దిల్లీ అసెంబ్లీ కమిటీ ఇటీవల ఫేస్‌బుక్‌కు సమన్లు పంపిన విషయం తెలిసిందే. తొలిసారి నోటీసులపై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. ‘ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే మేము పార్లమెంటు కమిటీ ముందు హాజరయ్యాం. మీరు పంపిన నోటీసులను వ్యతిరేకిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. కాగా ఫేస్‌బుక్‌ స్పందనపై శాంతి భద్రతల కమిటీ తీవ్రంగా స్పందించింది. సంస్థ ప్రకటన ఆమోదించదగినది కాదని.. దిల్లీ అసెంబ్లీ పార్లమెంటుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఏడాది ఆరంభంలో ఈశాన్య దిల్లీలో సీఏఏ నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వాటిల్లో 53 మంది మరణించారు. అందుకు గానూ విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ పట్టించుకోలేదని ఆగస్టు 31 జరిగిన విచారణలో కమిటీ తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని