
ఎమ్మెల్యేలను జైసల్మేర్కు తరలించిన గహ్లోత్
జైపుర్: రాజస్థాన్ రాజకీయాల్లో ఏర్పడ్డ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన వర్గ ఎమ్మెల్యేలను జైపుర్ నుంచి జైసల్మేర్కు తరలించారు. శాసనసభ సమావేశ తేదీని ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు మరింతగా ఉపందుకున్నాయని ఆరోపించిన గహ్లోత్ ఈ మేరకు జాగ్రత్త పడ్డారు. రాజధాని జైపుర్ నుంచి జైసల్మేర్ 550 కి.మీ దూరంలో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అవతలి వర్గం వీరిని సంప్రదించే అవకాశమే ఉండదని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం.
తొలుత రూ.25 కోట్లు ఇస్తామని బేరమాడిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని పరోక్షంగా అసమ్మతి వర్గాన్ని ఉద్దేశించి గహ్లోత్ గురువారం ఆరోపించారు. సచిన్ పైలట్తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మరుసటి రోజు నుంచి గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు జైపుర్ శివారులోని ఫెయిర్మాంట్ హోటల్లో బస చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వారంతా అక్కడే ఉంటున్నారు. ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు హోటల్లోనే ఉండాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.