ప్రపంచం మెచ్చిన..‘మహో’పాధ్యాయుడు

మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్‌ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2020’ వరించింది! దీని కింద ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు.

Updated : 04 Dec 2020 16:53 IST

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి రూ.7 కోట్ల ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’

లండన్‌: మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్‌ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2020’ వరించింది! దీని కింద ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు. ఉపాధ్యాయునిగా అత్యంత ప్రభావం చూపి, వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి వర్కే ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డును అందిస్తోంది. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో గురువారం ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయనీ, తుది దశ ఎంపికలో మొత్తం పది మంది నిలవగా... రంజిత్‌ విజేతగా నిలిచారని ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. 

ఎందుకిచ్చారంటే..

సోలాపుర్‌ జిల్లా, పరిదేవాడికి చెందిన జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ (32) ఎంతో ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. గోదాము, గోశాల మధ్య శిథిలావస్థలో ఉన్న బడి భవనాన్ని బాగుచేయించారు. పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేసి... వాటిని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గ్రామంలో బాల్య వివాహాలను నిర్మూలించారు. బాలికలు నూరు శాతం బడులకు హాజరయ్యేలా చొరవ తీసుకున్నారు. వారాంతాల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు తీసుకెళ్లి... సమాజం, వనరుల పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

‘‘రంజిత్‌ సిన్హ్‌ లాంటి ఉపాధ్యాయులు వాతావరణ మార్పుల వంటి సమస్యలకు పరిష్కారం చూపగలరు. ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలరు. అసమానతలను రూపుమాపి.. ఆర్థిక వృద్ధికి తోడ్పాడునందిస్తారు. మొత్తంగా చెప్పాలంటే ఇలాంటివారు మన భవిష్యత్తునే మార్చగలరు’’ అని యునెస్కో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టెఫానియా జియాన్నిని తెలిపారు. ఈ అవార్డు అందజేస్తున్న సంస్థల్లో యునెస్కో విద్యా విభాగం కూడా ఒకటి. ఈ అవార్డుకు పోటీపడిన ఉపాధ్యాయులను బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభినందించారు. మహమ్మారి సంక్షోభ కాలంలో టీచర్ల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఇక ‘కొవిడ్‌ హీరో అవార్డు’ పేరిట ఇచ్చిన ప్రత్యేక పురస్కారానికి యూకేకు చెందిన గణిత ఉపాధ్యాయుడు జేమీ ఫ్రాస్ట్‌కు అందజేశారు. ఆయన ‘డాక్టర్‌ఫ్రాస్ట్‌మ్యాథ్స్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సంక్షోభ కాలంలో పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులకు పాఠాలను చేరువ చేస్తున్నారు.

ప్రపంచాన్ని మార్చేది ఉపాధ్యాయులే

‘‘ప్రపంచాన్ని నిజంగా మార్చగలిగేది ఉపాధ్యాయులే. సమాజానికి పంచి పెట్టడంలోనే వారు ఆనందం పొందుతారు. అందుకే నాకు వచ్చే ప్రైజ్‌ మనీలో సగం తోటి పోటీదారులతో పంచుకుంటా. ఉపాధ్యాయులుగా వారెంతో  కృషి చేస్తున్నారు. మిగిలిన మొత్తంలోని కొంత సొమ్ముతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాను. వెనకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు కృషి చేస్తాను’’ 
- రంజిత్‌ సిన్హ్‌ దిసాలే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని