హైకోర్టు పర్యవేక్షణలోనే హాథ్రస్‌ కేసు విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటనపై సీబీఐ జరుపుతున్న విచారణను ప్రస్తుతానికి అలహాబాద్‌ హైకోర్టే పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.........

Published : 27 Oct 2020 13:52 IST

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటనపై సీబీఐ జరుపుతున్న విచారణను ప్రస్తుతానికి అలహాబాద్‌ హైకోర్టే పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర కోణాలను సైతం హైకోర్టే చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షుల భద్రతను కూడా హైకోర్టే పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. కేసు విచారణను ఉత్తర్‌ప్రవేశ్‌ వెలుపల దిల్లీలోని ఓ కోర్టులో జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, సీబీఐ విచారణపైనా తమకు నమ్మకం లేదని.. ఈ కేసును సుప్రీంకోర్టే స్వీకరించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పర్యవేక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలిని తీవ్రంగా హింసించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. తొలుత సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. అనంతరం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీంతో ఈ కేసు విచారణ సీబీఐ చేతికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని