ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ ఆపొద్దు: కేంద్రం

దేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.

Published : 01 Dec 2020 21:19 IST

టీకాపై ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. చెన్నైకి చెందిన ఓ వాలంటీర్‌ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో సమీక్షించిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. ‘వాలంటీర్‌ అనారోగ్యంపై ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం, ప్రయోగాలను నిలిపివేసేందుకు అవసరమైన ఎలాంటి కారణాలు కనిపించలేదు. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. అన్ని డాక్యుమెంట్లను సమీక్షించిన తర్వాతే  ప్రయోగాలు జరిపేందుకు ఎస్‌ఐఐకు అనుమతి ఇచ్చాం. మూడో దశ ప్రయోగాలు జరిపేందుకు భారత్‌ బయోటెక్‌కు కూడా అనుమతి పొందింది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్ మీడియా సమావేశంలో‌ వెల్లడించారు. కాగా తప్పుడు ఆరోపణలు చేశారని వాలంటీరుపై రూ.100కోట్ల పరువునష్టం దావా వేస్తామన్న ప్రకటనను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌  సమర్థించుకుంది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా చెన్నైకి చెందిన ఓ వాలంటీర్‌ తనకు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తాయని ఆరోపిస్తూ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు నోటీసులు పంపించారు. దీన్ని ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ తోసిపుచ్చగా.. నిపుణుల సమీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు నిలిపివేసే అవసరం లేదని స్పష్టంచేసింది.

ఇవీ చదవండి..
కొవిషీల్డ్‌ టీకాపై దుమారం..
ఆయన అనారోగ్యానికి టీకాతో సంబంధం లేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని