హాంకాంగ్‌లో ఎయిరిండియాపై నిషేధం

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ఎయిరిండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....

Published : 20 Aug 2020 01:11 IST

దిల్లీ: ఎయిరిండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ఎయిరిండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నిషేధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. దీంతో ఆగస్టు 18, 21, 25, 28 తేదీల్లో విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.

వందే భారత్ మిషన్‌లో భాగంగా హాంకాంగ్ నుంచి దిల్లీకి ఎయిరిండియా విమాన సేవలు నిర్వహిస్తుంది. అయితే హాంకాంగ్‌కు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకుని కరోనా నెగెటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఇటీవల ఎయిరిండియా విమానంలో హాంకాంగ్‌కు వచ్చిన 11 మంది ప్రమాణికులకు అక్కడి విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో నిబంధనలు పాటించడంలేదనే కారణంతో ఎయిరిండియాపై నిషేధం విధించారు. విమాన సేవల పునురుద్ధరణపై హాంకాంగ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.

కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. నిబంధనలు సడలించిన తర్వాత, విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను తరలించేందుకు వందే భారత్‌ మిషన్ పేరుతో ఎయిర్‌ బబుల్ ఒప్పందం ద్వారా ఎయిరిండియా అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 2 వేల విమాన సర్వీసుల ద్వారా లక్షా యాభై వేల మంది ప్రయాణించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. తాజాగా ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరీ మంగళవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని