నెలలోనే 26లక్షల కేసులు, 33వేల మరణాలు!

ఒక సెప్టెంబర్‌ నెలలోనే దేశవ్యాప్తంగా 26లక్షల కేసులు నమోదయ్యాయి.

Updated : 01 Oct 2020 17:24 IST

దేశంలో కొవిడ్‌ రోగుల్లో 98వేల మంది మృత్యువాత
24గంటల్లో 86వేల కేసులు, 1181 మృతి!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి నెల భారీ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సెప్టెంబర్‌ నెలలోనే దేశవ్యాప్తంగా 26లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇవి దాదాపు 40శాతం. అంతేకాకుండా ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఒక్క నెలలోనే 33వేల మంది మృత్యువాతపడ్డారు. ఇక రోజువారీ కేసుల్లోనూ భారీ పెరుగుదల నమోదవుతోంది. నిత్యం దాదాపు 80వేలకుపైగా కేసులు వస్తున్నాయి. నిన్న మరో 86,821 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 63,12,584కు చేరింది. కొవిడ్‌ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల వ్యవధిలో 1181 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 98,678కి చేరింది.

దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారిసంఖ్య క్రమంగా పెరగడం ఊరట కలిగించే విషయం. గడిచిన 24గంటల్లో 85,376 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 52,73,201 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మరో 9లక్షల 40వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం, దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53శాతం ఉండగా, మరణాల రేటు 1.56శాతంగా ఉంది.

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోన్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగానే చేపడుతున్నారు. నిన్న 14,23,052 కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 7కోట్ల 56లక్షల టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని