
లాలూకు బెయిల్ వాయిదా..
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. లాలూకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు ఆరు వారాల పాటు వాయిదా వేసింది. లాలూ ప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్ల అక్రమ ఉపసంహరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్ అఫిడవిట్, లాలూ జ్యుడీషియల్ కస్టడీ పత్రాలను సీబీఐ గురువారం కోర్టుకు అందించింది.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జైలు నియమాలు ఉల్లంఘించినట్లు సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది. ప్రస్తుతం లాలూ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనను రాంచీలోని రిమ్స్ నుంచి బిర్సా ముండా ఆసుపత్రికి తరలించినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను జనవరి 22న పరిశీలించనున్నట్లు లాలూ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి దేవర్షి మండల్ చెప్పారు. రూ. 950 కోట్ల కుంభకోణానికి సంబంధించిన వేరే మూడు కేసుల నుంచి 2018 మార్చి 24న లాలూ బెయిల్ పొందారు. సీబీఐ ప్రత్యేక కోర్టు డుమ్కా ఖజానా కేసులో లాలూకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.