రోజువారీ కేసుల్లో ఆ దేశ మొత్తాలను దాటేశాం!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్‌-19 తీవ్రతకు అద్దం......

Updated : 03 Sep 2020 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్‌-19 తీవ్రతకు అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి విస్తృతమవ్వడం.. పరీక్షల సంఖ్య పెరగడం ఇందుకు కారణం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే రీతిలో పెరిగితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనా మొత్తం కేసులను మన రోజువారీ కేసులు దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ దేశాల స్థాయిలో..

దేశంలో ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో గతంలో వందల్లో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఒకటో తేదీ నాటికి దేశంలో మొత్తం కేసులు 17 లక్షలు కాగా.. చివరి నాటికి రెట్టింపు అయ్యింది. ఆగస్టు మొదటి వారం నుంచి రోజూ  50వేల కేసులకు పైబడే రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. అంటే బహ్రెయిన్‌ (మొత్తం కేసులు 52 వేలు), సింగపూర్‌ (56వేలు), పోర్చుగల్‌ (58 వేలు), పోలాండ్‌ (67వేలు), జపాన్‌ (69వేలు) యూఏఈ (70వేలు) దేశాల మొత్తం కేసులను ఇప్పటికే మనం దాటేశాం. ప్రస్తుతం స్వీడన్‌ (84వేలు), బెల్జియం (85వేలు) మొత్తం కేసులకు చేరువలో ఉన్నాం.

(నోట్‌: డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం..)


త్వరలో చైనాను..?

చైనాలో కేసుల పెరుగుదల తీరు ఇలా.. (pic credit: గ్రాఫ్‌ జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ)

కరోనా వైరస్‌ వెలుగుచూసిన చైనాలో ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 90,422గా ఉంది. కొత్తగా ఆ దేశంలో ఇప్పటికీ రోజూ 10 నుంచి 20 కేసులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటికి చైనా అన్‌లాక్ ప్రక్రియ చేపట్టింది. అప్పటికే దాదాపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మన దేశంలో లాక్‌డౌన్‌ చేపట్టినప్పుడు కాకుండా.. అన్‌లాక్‌ మొదలైన తర్వాత కేసుల పెరుగుదల మొదలైంది. ఈ సమయంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది.


భారత్‌లో కేసుల పెరుగుదల తీరు  (pic credit: గ్రాఫ్‌ జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ)


ఊరటనిచ్చే అంశాలివీ.. 

మన దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొన్ని ఊరట నిచ్చే అంశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు (1.7శాతం) తక్కువగా ఉంది. మన కంటే కేసుల పరంగా కేవలం లక్ష తేడాలో ఉన్న బ్రెజిల్‌లో మరణాల సంఖ్య 1.21 లక్షలు కాగా.. దాదాపు 60 లక్షల కేసులున్న అమెరికాలో 1.82 లక్షల మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ మరణాల సంఖ్య 67వేలతో పోలిస్తే బ్రెజిల్‌లో రెండు రెట్లు, అమెరికాలో మూడు రెట్ల అధికంగా మరణాలు సంభవించాయి. అలాగే, దేశంలో కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇప్పటికే 29.70 లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. పరీక్షలు కూడా 10 లక్షలకు పైగానే జరుగుతున్నాయి. దేశంలో రోగ లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారు. అలాంటి వారు వైరస్‌ వ్యాప్తి కారకులు కాకుండా చూసేందుకు ఈ పరీక్షల సంఖ్య ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు