35ఏళ్ల తర్వాత ILO కీలక స్థానంలో భారత్‌! 

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పాలక మండలి ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన ఏఐఎస్‌ అధికారి ఎన్నికయ్యారు.

Published : 24 Oct 2020 02:05 IST

దిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో భారత్‌ మరోసారి కీలక స్థానంలో చోటు సంపాదించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పాలక మండలి ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన ఏఐఎస్‌ అధికారి ఎన్నికయ్యారు. సీనియర్‌ ఐఏఎస్‌ అపూర్వ చంద్ర పాలకమండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ‘35ఏళ్ల తర్వాత ఐఎల్‌ఓ పాలకమండలి చైర్మన్‌గా భారత్ బాధ్యతలు చేపట్టింది. కార్మికశాఖ కార్యదర్శిగా ఉన్న అపూర్వ చంద్ర అక్టోబర్‌ 2020-జూన్‌ 2021 వరకు ఈ స్థానంలో కొనసాగుతారు అని’ భారత కార్మిక శాఖ తెలిపింది. భారత్‌- ఐఎల్‌ఓ మధ్య వంద సంవత్సరాల సుదీర్ఘ అనుబంధంలో ఇది నూతన అధ్యాయం అని కార్మిక శాఖ అభిప్రాయపడింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఉన్న విభాగాల్లో పాలక మండలిది ముఖ్యమైన స్థానం. సంస్థ విధానాలు రూపొందించడం, అజెండా, బడ్జెట్‌తోపాటు ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ను ఎన్నుకోవడంలో పాలకమండలిదే కీలకపాత్ర. అందుకే దీనికి ఛైర్మన్‌గా ఎన్నిక కావడం అంతర్జాతీయంగా గొప్ప విషయంగా భావిస్తారు. ఇలాంటి స్థానాన్ని భారత్‌ మరోసారి చేపట్టింది. ఈ సంవత్సరం నవంబరులో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం ఐఎల్‌ఓలో 187 సభ్య దేశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి విభాగాలన్నింటిలో సుదీర్ఘ చరిత్ర కలిగిన సంస్థగా ఐఎల్‌ఓకు పేరుంది. 1919లో ఏర్పడిన ఈ సంస్థ ఈ మధ్యే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని