కొవిడ్‌ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్‌!

కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డిసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది. 

Updated : 17 Oct 2020 16:45 IST

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో కేంద్రం నిర్ణయం

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌.. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితుల విషయంలో పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డిసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది.

దేశంలో కొవిడ్‌-19 బాధితులకు రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, రిటోనావిర్‌ (లోపినావిర్‌), ఇంటర్‌ఫెరాన్‌ అనే ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిలో హైడ్రాక్సీ ఔషధాన్ని కొవిడ్‌ ప్రారంభ దశలో, రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. దేశంలో కొవిడ్ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్‌డెసివిర్‌ కావడం గమనార్హం.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌ 15న నిర్వహించిన ట్రయల్స్‌లో భారత్‌ నుంచి 937 మంది పాల్గొన్నారు. దీనిలో పై నాలుగింటిలో రెమ్‌డెసివిర్‌తో సహా ఏ ఔషధం మరణాల రేటును తగ్గించినట్టు కచ్చితంగా వెల్లడి కాలేదని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇక ఇంటర్‌ఫెరాన్‌, కరోనా రోగులకు హానికరమని తెలిసిందని.. దానితో కరోనా చికిత్సలో దీని వాడకాన్ని నిలిపివేస్తున్నామని వారు వెల్లడించారు.

ఈ ట్రయల్స్‌ వల్ల కరోనా చికిత్సకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం లభించిందని భారత్‌లో ఈ అధ్యయనాన్ని పర్యవేక్షించిన నిపుణులు తెలిపారు. దేశంలో రికవరీ రేటుకు సంబంధించిన గణాంకాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విధానంపై  పునఃసమీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవల నేతృత్వంలో జరిగే కార్యాచరణ (టాస్క్‌ ఫోర్స్‌) సమావేశంలో చర్చించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని