హద్దు మీరితే కాల్పులే!

తూర్పు లద్దాఖ్‌లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టంచేసింది.

Updated : 26 Sep 2020 13:42 IST

తోపులాటలు, కర్రలతో ఘర్షణలు ఇక ఉండవు 
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ మీ వైపే ఆరంభం కావాలి
చైనాకు తేల్చి చెప్పిన భారత్‌ 

దిల్లీ : తూర్పు లద్దాఖ్‌లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టంచేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇక కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్‌ ప్రతిపాదనను తిరస్కరించింది. ఉద్రిక్తత నెలకొన్న అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ సాగాల్సిందేనని స్పష్టంచేసినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇటీవల జరిగిన సైనిక కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో ఈ అంశాలపై భారత్‌ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వివరించాయి. భారత శిబిరాలను ఆక్రమించడానికి లేదా కర్రలు, శూలాలు తదితర ఆయుధాలతో సామూహిక దాడులకు చైనా ప్రయత్నిస్తే కాల్పులు జరపాలని మన బలగాలకు ఆదేశాలు అందాయి. ఇదే విషయాన్ని డ్రాగన్‌ సేనకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘సరిహద్దుల్లో బలగాల పరస్పర తోపులాటలను ఇక సహించబోమన్న సందేశాన్ని వారికి చేరవేశాం. ఆటవిక ఆయుధాల వినియోగమూ కుదరదని తేల్చి చెప్పాం’’ అని వివరించాయి. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇప్పటికే పలుమార్లు గాల్లోకి కాల్పులు జరుపుకొన్న ఘటనలు జరిగాయని గుర్తు చేశాయి. ఇందులో చిన్నపాటి ఆయుధాలను మాత్రమే ఉపయోగించారని, భారీ ఆయుధాలను ఇంకా క్రియాశీలం చేయలేదని తెలిపాయి. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో భారత సైనికులకు.. అమెరికా నుంచి తాజాగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక సిగ్‌ సావర్‌ తుపాకులను అందజేసినట్లు పేర్కొన్నాయి. 

జూన్‌ 15న గల్వాన్‌ లోయలో ఇరు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది చైనా సైనికులు చనిపోయారని అధికార వర్గాలు చెప్పాయి. ‘‘సరిహద్దుల రక్షణకు ఎంతకైనా సిద్ధమన్న సంకేతాన్ని ఈ చర్య ద్వారా చైనాకు ఇచ్చాం. నాటి ఘర్షణలో బెటాలియన్‌ కమాండర్‌ సహా కనీసం ఐదుగురు సైనికులు చనిపోయినట్లు దౌత్య చర్చల్లో చైనా అధికారులు అంగీకరించారు. వాస్తవంగా వారి వైపున ప్రాణనష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు’’ అని ఓ అధికారి తెలిపారు. సరిహద్దుల్లో బలగాలను పెంచరాదంటూ కుదిరిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనా మాటలను తాము గుడ్డిగా నమ్మబోమని, అప్రమత్తతను కొనసాగిస్తామని తెలిపారు. ఆ దేశం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డ ఉదంతాలు అనేకం ఉన్నాయని వివరించారు. 

మొదట మీరే.. 
బలగాల ఉపసంహరణ ప్రక్రియపై రెండు దేశాల సైన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలన్న అంశంపై మాత్రం ఏకాభిప్రాయం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘బలగాల ఉపసంహరణపై జరిగే చర్చల్లో దెప్సాంగ్, సైనిక ప్రతిష్టంభన ఏర్పడిన ఇతర ప్రాంతాలనూ చేర్చాలని స్పష్టంచేశాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి కాకుండా ఏకకాలంలో ఉపసంహరణ జరగాలన్నాం. చైనా దురుసు చర్యల వల్లే ఈ సైనిక ప్రతిష్టంభన ఏర్పడిందని, అందువల్ల బలగాల ఉపసంహరణ విషయంలో ముందుగా చర్యలు చేపట్టాల్సింది ఆ దేశమేనని తేల్చి చెప్పాం. పాంగాంగ్‌ దక్షిణ రేవులో భారత బలగాల ఆధీనంలో ఉన్న పర్వత ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకే వస్తాయని, అక్కడి నుంచి సైనికులను వెనక్కి రప్పించబోమని స్పష్టంచేశాం’’ అని తెలిపాయి. అయితే ఇరు దేశాల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొన్ని చర్చలు అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

నిఘా వైఫల్యం లేదు..
ఎల్‌ఏసీ వెంబడి చైనా 50వేలకుపైగా బలగాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించిందని భారత వర్గాలు తెలిపాయి. వీరి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఏ దశలోనూ నిఘా వైఫల్యం లేదని వివరించాయి. అయితే చివరి నిమిషంలో జరిగే కదలికలు, మోహరింపులను తెలుసుకోవడం కష్టమని తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన తీరును వివరిస్తూ.. ‘‘మే 5న గల్వాన్, పాంగాంగ్, నాకులా వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. పాంగాంగ్‌ వద్ద ఫింగర్‌-4 ప్రాంతం వద్ద సైనిక ప్రతిష్టంభన చోటుచేసుకుంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో రెండు దేశాల తరఫున 30-40 మంది సైనికులు చొప్పున మాత్రమే అక్కడ ఉంటారు. కొద్దిసేపు ఎదురెదురుగా నిలబడ్డాక వెనుదిరుగుతుంటారు. మే నెలలో మాత్రం చైనా వెయ్యి మందికిపైగా సైనికులను అక్కడికి పంపింది. ఫింగర్‌-4 ప్రాంతాన్ని ఆక్రమించింది’’ అని పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని