7 నుంచి విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల తరలింపు చేపట్టిన కేంద్రం.. తాజాగా విదేశాల్లోని భారతీయులను.......

Updated : 17 Aug 2022 12:26 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల తరలింపు చేపట్టిన కేంద్రం.. తాజాగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను చేపట్టింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని మే 7 నుంచి దశలవారీగా విమానాల్లోనూ, నౌకల్లో స్వదేశానికి తరలిస్తామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. చెల్లింపులు ఆధారంగా ఈ సేవలు అందిస్తామని పేర్కొంది.

‘‘విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాం. దశవారీగా విమానాల్లో, నౌకల్లో వారిని తీసుకొస్తాం. విదేశాల్లో చిక్కుకున్న వారి వివరాలను  భారత రాయభార కార్యాలయాలు, హైకమిషన్లు రూపొందిస్తున్నాయి. చెల్లింపుల ప్రాతిపదికన ఈ నెల ఏడు నుంచి దశలవారీగా తరలింపు ప్రక్రియ చేపడతాం’’ అని ప్రకటనలో పేర్కొంది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ముందుగా స్క్రీనింగ్‌ నిర్వహించి.. ఎలాంటి కరోనా లక్షణాలూ లేవనుకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని హోంశాఖ స్పష్టంచేసింది. గమ్యస్థానాలకు చేరుకున్న వారంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలపింది. వచ్చాక 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, గడువు ముగిశాక వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టింగ్‌, క్వారంటైన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని