లాక్‌డౌన్‌లో బోర్‌.. స్నాక్స్‌తో పరార్‌

ఖాళీగా కూర్చుకున్నప్పుడు చిరుతిళ్లు తినడం.. చిప్స్‌ ప్యాకెట్‌ పట్టుకుని టీవీ ముందు కూర్చోవడం మనలో చాలా మందికి అలవాటే.. అయితే ఈ ఏడాది కరోనా తెచ్చిన లౌక్‌డౌన్‌ కారణంగా చాలాకాలం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి

Published : 12 Dec 2020 01:40 IST

కరోనా ముందుతో పోలిస్తే ఎక్కువగా చిరుతిళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖాళీగా కూర్చున్నప్పుడు చిరుతిళ్లు తినడం.. చిప్స్‌ ప్యాకెట్‌ పట్టుకుని టీవీ ముందు కూర్చోవడం మనలో చాలా మందికి అలవాటే.. అయితే ఈ ఏడాది కరోనా తెచ్చిన లౌక్‌డౌన్‌ కారణంగా చాలాకాలం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటకు వెళ్లే పరిస్థితి లేక.. ఇంట్లో కాలక్షేపం కాక లాక్‌డౌన్‌ తొలినాళ్లలో చాలా మంది బోర్‌గా ఫీలయ్యారు. ఇంకేముంది టైంపాస్‌ కోసం నోటికి పనిచెప్పారు. అలా లాక్‌డౌన్‌లో స్నాక్స్‌ను విపరీతంగా లాగించేశారు. కరోనా ముందు కాలంతో పోలిస్తే భారతీయులు ఎక్కువగా చిరుతిళ్లు తిన్నారట. ఈ మేరకు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

లాక్‌డౌన్‌లో ఆహార అలవాట్లపై మోండెలెజ్‌ ఇంటర్నేషనల్‌, ది హారిస్‌ పోల్‌ ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. దీని ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది గతంలో కంటే లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువగా స్నాక్స్‌ తిన్నట్లు తేలింది. 66శాతం మంది బోర్‌డమ్‌ను పోగొట్టుకునేందుకు చిరుతిళ్లను ఎంచుకున్నారట. భోజన సమయంలోనూ పంటికింది కోసం స్నాక్స్‌ ఎక్కువగా తీసుకున్నట్లు ఈ సర్వే పేర్కొంది. చిరుతిళ్లు ఆనందంతో పాటు సౌకర్యాన్ని ఇవ్వడమేగాక, ఒంటరితనాన్ని కూడా దూరం చేశాయని భారతీయలు భావించినట్లు సర్వే వెల్లడించింది.

ఇక మహమ్మారి తీవ్రంగా ఉన్న తొలినాళ్లలో లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది భారతీయులు స్వయంగా వంటలు చేసుకునేందుకు ఇష్టపడ్డారు. వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపారని సర్వే తెలిపింది. అయితే దీని వల్ల ఆహార విక్రయాలు సన్నగిల్లాయి. మార్కెట్‌ రీసర్చర్‌ నీల్సన్‌ అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో స్నాక్స్‌, పానియాల అమ్మకాలు 25శాతం పడిపోగా.. సెప్టెంబరు త్రైమాసికంలో 6.9శాతం తగ్గాయి.  అయితే అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత.. ప్రజలు మళ్లీ బయట ఆహారానికి మొగ్గుచూపారు. కాగా.. ఇప్పటికీ 81శాతం మంది భారతీయులు భారీ భోజనాల కంటే చిరుతిళ్లనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. చిరుతిళ్లలో ఎక్కువగా ప్రొటీన్‌, విటమిన్లు ఉన్నవాటికే చాలా మంది ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది. 

ఇవీ చదవండి..

ఆకలి తీర్చుకునేందుకు అప్పులు

హీరో ఛాలెంజ్‌.. 275 రోజులు ఇంట్లోనే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని