చైనాకు పాక్‌ సాయం..? 

పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్‌ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ షెన్‌ సీవే ట్విటర్‌లో ఒక వీడియోను పంచుకొన్నాడు.

Published : 05 Oct 2020 01:26 IST

 పీఎల్‌ఏకు పాక్‌ సైనికుల శిక్షణ

ఇంటర్నెట్‌డెస్క్‌: పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్‌ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ షెన్‌ సీవే ట్విటర్‌లో ఒక వీడియోను పంచుకొన్నాడు. 52 క్షణాల నిడివి ఉన్న ఈ వీడియోలో 0.05 సెకన్ల వద్ద ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఏమాత్రం చైనీయుడులాలేడు. గడ్డం పెంచుకొని పొడవుగా భిన్నంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరూ అనే విషయాన్ని మాత్రం షెన్‌ ప్రస్తావించలేదు. ఈ వీడియోను విశ్లేషించిన సైనిక నిపుణులు మాత్రం ఆ వ్యక్తి పాకిస్థాన్‌ ఆర్మీలోని ఎస్‌ఎస్‌జీ కమాండో అని చెబుతున్నారు. 

ఎప్పటి నుంచో పాక్‌ సాయం..

భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనా-పాక్‌లు ఎప్పటి నుంచో పరస్పరం సాయం చేసుకొంటున్నాయి. గత ఏడాది గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లోని స్కర్థూ ఎయిర్‌బేస్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. ఇటీవల జూన్‌లో అక్కడ ఒక ఐఎల్‌78 ట్యాంకర్‌ విమానం కనిపించింది. చైనాకు చెందిన ఎయిర్‌ రిఫ్యూలర్‌ విమానంగా దీనిని గుర్తించారు. దీంతో ఈ రెండు దేశాలు ఏ స్థాయిలో పరస్పరం సహకరించుకొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

జూన్‌లో చైనాకు చెందిన హాంగ్‌ గుజి అనే సైనిక నిపుణుడు మోడర్న్‌ వెపనరీ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. దీనిలో భారత్‌ పర్వత యోధుల శక్తిని చెప్పుకొచ్చాడు. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు వేటిల్లోనూ భారత్‌ అంత శక్తిమంతమైన మౌంటేన్‌ వార్ఫేర్‌ బృందం లేదని పేర్కొన్నారు. భారత్‌ సియాచిన్‌ గ్లేషియర్‌లో తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. ఈ అనుభవం భారత్‌కు అక్కరకొస్తోంది. ఇదే కారణంతో భారత పర్వత యోధులను ఎదుర్కొనేందుకు పాక్‌ను సాయం కోరినట్లు భావిస్తున్నారు.

తాజాగా స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌  దళాలు స్పంగూర్‌ వద్ద చైనాకు షాకివ్వడంతో పీఎల్‌ఏలో ఆందోళన పెరిగిపోయింది. దీంతో పాక్‌ దళాలను కూడా పిలిపించి ఉండవచ్చు. పాక్‌ దళాలకు భారత సైన్యాన్ని సియాచిన్‌ వంటి చోట్ల ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఇప్పుడు ఈ అనుభవాన్ని చైనా వాడుకోవాలని చూస్తోంది.

అక్కరకొచ్చిన ముందు జాగ్రత్త..!

1962, 67ల్లో చైనా తీరును చూసిన భారత్‌ 1970 నుంచి పర్వత యుద్ధతంత్రంపై దృష్టి పెట్టింది. భారత్‌, పాక్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే శత్రుదళాలు, ముష్కరులు దేశంలోకి చొరబడుతుంటారు. దీంతో భారత దళాలు పర్వతాలపై పట్టు సాధించడంపై దృష్టిపెట్టాయి. భారీ సంఖ్యలో సైనికులకు పర్వత యుద్ధతంత్రంపై శిక్షణ ఇచ్చింది.  మన బలగాల్లో అత్యధిక మంది సర్వీసు కూడా పర్వతాలపైనే ఉంటోంది.  మౌంటెన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంపై కూడా దృష్టిపెట్టింది.

ఓ అంచనా ప్రకారం భారత్‌ వద్ద దాదాపు 12 డివిజన్లతో 2,00,000 మంది పర్వత యుద్ధతంత్ర నిపుణులు ఉన్నారు.  వీరికి పారామిలటరీ సిబ్బంది అదనం. పారామిలటరీ కూడా ఇప్పటికే పలు చోట్ల పర్వత కనుమలకు పహారా బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌లో పనిచేసిన అనుభవం మన సైనికుల సొంతం. అక్కడ కనీసం ఆరువేల మంది సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు.

భారత్‌కు జమ్ము సమీపంలో హై ఆల్టిట్యూడ్‌ మౌంటెన్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌ కూడా ఉంది. ప్రపంచ అత్యున్నత యుద్ధతంత్ర శిక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. చాలా మిత్రదేశాలకు చెందిన దళాలు ఇక్కడ శిక్షణ పొందడానికి వస్తాయి. వీటిల్లో అమెరికా, రష్యా, యూకే  వంటి అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి.  దళాలను పర్వత ప్రాంతాలకు తగ్గట్లు శారీరకంగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.  దీనికి అదనంగా కార్గిల్‌ బ్యాటిల్‌ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది.  ఇటువంటి  శిక్షణ, వ్యూహాల కారణంగా పాక్‌కు కశ్మీర్‌ సరిహద్దుల్లో మనవాళ్లు గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నారు. ముఖ్యంగా కార్గిల్‌ పాఠాలు మనవాళ్లకు ఇప్పుడు ఉపయోగపడనున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని