జో బైడెన్ భారత్‌కు కొత్త కాదు..

భారత్‌-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కష్టసాధ్యం కాదని భారత విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 18 Nov 2020 19:54 IST

భారత్‌-అమెరికా సత్సంబంధాలపై మంత్రి జై శంకర్‌ విశ్వాసం

దిల్లీ: జో బైడెన్‌ అధ్యక్షుడిగా అగ్రరాజ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కష్టసాధ్యమేమీ కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జై శంకర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ భారత దేశానికేమీ కొత్త కాదని ఆయన వివరించారు.

ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో జై శంకర్‌ మాట్లాడుతూ.. 2000లో బిల్‌ క్లింటన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని, దానిలో బైడెన్‌ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను భారత రాయబారిగా ఉన్నానని జై శంకర్‌ వివరించారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాము ఆయనతో కలసి పనిచేశామని మంత్రి తెలిపారు. అంతకు ముందు బైడెన్‌ సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ సభ్యుడిగా, అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో కలసి పనిచేశామని ఆయన తెలిపారు.

క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌ తదితరుల రూపంలో అమెరికాకు విభిన్న వ్యవహార శైలి గల అధ్యక్షులు లభించారని, అయితే వారందరూ భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించిన వారే అని మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్‌ గానీ ఇరుదేశాల వ్యవహారాలు గానీ జో బైడెన్‌కు కొత్త కాదన్నారు. ఆయన ప్రభుత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతం కాగలవని విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల మాదిరిగానే భారత్‌-అమెరికా సంబంధాలు ప్రస్తుతమున్న స్థితి నుంచి మరింత ముందుకు సాగగలవని జై శంకర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని