మా భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది: గహ్లోత్‌

కాంగ్రెస్‌ పార్టీపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలను మనోవేదనకు గురిచేశాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లాత్‌ అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ట్విటర్‌ వేదికగా గహ్లాత్‌ వెల్లడించారు.

Published : 17 Nov 2020 01:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలను మనోవేదనకు గురిచేశాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాల్ని కపిల్‌ సిబల్‌ మీడియా వద్ద ప్రస్తావించాల్సింది కాదు. అవి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తాయి. గతంలోనూ పార్టీ పలు సమయాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంది. కానీ మా భావజాలం, కార్యక్రమాలు, పటిష్టమైన నాయకత్వం ఉండటంతో సంక్షోభ సమయాలనుంచి గట్టెక్కాం. ప్రతిసారీ మేం నిలదొక్కుకోగలిగాం. ఆ తర్వాత 2004లో సోనియా నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మేం సంక్షోభ పరిస్థితులను అధిగమిస్తాం’ అని గహ్లాత్ విశ్వాసం వ్యక్తంచేశారు. అదేవిధంగా సిబల్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ... ‘ఎన్నికల్లో ఓటమికి వివిధ రకాల కారణాలుంటాయి. అనేకసార్లు సంక్షోభాలు ఏర్పడినప్పటికీ దృఢమైన నాయకత్వం, ఐక్యతతో బయటపడ్డాం. ఈ రోజు వరకు కూడా దేశ సమగ్రతను కాపాడి, అభివృద్ధి పథంలో తీసుకువెళ్లగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్సే’ అని గహ్లోత్‌ అన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుల్లో ఒకరైన కపిల్ ‌సిబల్‌ బిహార్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమవారం పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఇక కాంగ్రెస్‌ను ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి ఎత్తిచూపారు. పార్టీలో వెంటనే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోని కాంగ్రెస్‌ ఇకముందు ఎలా చేసుకుంటుందని ఘాటు విమర్శలు చేశారు. 

కాంగ్రెస్‌ ఇక ప్రత్యామ్నాయం కాదు: కపిల్‌ సిబల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని