అసెంబ్లీ సమావేశానికి కేరళ గవర్నర్‌ ఓకే

కేరళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశ నిర్వహణకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ అంగీకరించారు. ఈ నెల 31న ఒకరోజు సమావేశానికి ఆమోదం తెలిపారు. ప్రత్యేక సమావేశం..

Published : 29 Dec 2020 00:01 IST

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశ నిర్వహణకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ అంగీకరించారు. ఈ నెల 31న ఒకరోజు సమావేశానికి ఆమోదం తెలిపారు. ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటూ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ తాజా ప్రతిపాదన పంపిన నేపథ్యంలో ఒకరోజు సమావేశం నిర్వహించేందుకు గవర్నర్‌ అంగీకరించారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది.

వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరడం.. అందుకు ఆయన తిరస్కరించడం వార్తలకెక్కింది. రాష్ట్ర పరిధిలో లేని అంశంపై చర్చించి సమస్యకు ఏం పరిష్కారం కనుగొంటారని సీఎం విజయన్‌కు గవర్నర్‌ లేఖ రాశారు. గవర్నర్‌ తన అధికారాలతో ప్రభుత్వాన్ని నియంత్రించడం సరికాదని సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో మరోసారి రాష్ట్ర కేబినెట్‌ గవర్నర్‌కు ప్రతిపాదన పంపించింది. ఆహారధాన్యాల కోసం కేరళ ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉందని, వ్యవసాయ రంగం సైతం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో దీనిపై చర్చ జరగాల్సి ఉందని తాజా ప్రతిపాదనలో కేబినెట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శితో చర్చించిన గవర్నర్‌ అసెంబ్లీ సమావేశం ఏర్పాటుకు అంగీకరించారు.

ఇవీ చదవండి..
రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
రైతులకోసం నిరాహార దీక్ష చేస్తా: అన్నా హజారే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని