ఎయిర్‌పోర్ట్‌ లీజుపై ప్రధానికి విజయన్‌ లేఖ

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టును అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 50 ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వడంపై కేరళ సర్కారు అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ.......

Published : 21 Aug 2020 00:00 IST

తిరువనంతపురం: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టును అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 50 ఏళ్ల కాలానికి లీజుకు ఇవ్వడంపై కేరళ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగిస్తామన్న హామీని కేంద్ర కేబినెట్‌ విస్మరించిందని పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జయపుర, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు.

తిరువనంతపురం విమానాశ్రయానికి కేరళ సర్కారు 2005లో 23.57 ఎకరాల భూమిని ఉచితంగా ఏఏఐకి బదలాయించింది. అయితే, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఏఏఐ అప్పట్లో హామీ ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ హామీని విస్మరించిందని విజయన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పక్కన పెట్టి కేంద్ర కేబినెట్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తప్పుబట్టారు. కేబినెట్‌ నిర్ణయానికి తాము సహకరించబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. కోచి, కన్నూర్‌ విమానాశ్రయాలను ఎస్పీవీ కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తున్న విషయాన్ని లేఖలో పొందుపరిచారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని