
కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే
కొలికోడ్: కేరళలోని కొలికోడ్లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పటి వరకు 19 మందిని పొట్టన పెట్టుకుంది. శుక్రవారం ఐఎక్స్ 1355 ఎయిర్ ఇండియా విమానం ఇక్కడి టేబుల్ టాప్ రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పటంతో ఈ దుర్ఘటన సంభవించింది. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయి నుంచి భారత్కు వచ్చిన ప్రవాస భారతీయులు.. మరికొద్ది సేపట్లో తమ స్వస్థలాలకు చేరుతారనగా జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని కలవరపరచింది. కాగా, అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం చివరిలో ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందనే అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
*రాత్రి 7:40 గంటలు: భారీ వర్షం కురుస్తుండటంతో ఎయిరిండియా బోయింగ్ విమానం, టేబుల్ టాప్ రన్వేపై అదుపుతప్పి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. దీనిని గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒకరు ఈ సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించారు.
* రాత్రి 7:41 గంటలు: సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూం నుంచి సీఐఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ టీంకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందింది.
* రాత్రి 7:42 గంటలు: విమానాశ్రయ అగ్నిమాపక దళానికి సమాచారం అందటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
*రాత్రి 7:43 గంటలు: సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఘటనను గురించి విమానాశ్రయ వైద్య విభాగానికి సమాచారమిచ్చారు.
*రాత్రి 7:44 గంటలు: సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూం అధికారులు విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ అధికారితో సంప్రదింపులు జరిపారు.
*రాత్రి 7:45 గంటలు: సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం చేరింది.
*ఈలోగా కొంతమంది స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో.. స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుకేందుకు విమానాశ్రయ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. సమయానుగుణమైన ఈ నిర్ణయం, అధిక నష్టం సంభవించకుండా దోహదపడింది.
కాగా, మే 22, 2010న మంగుళూరులో ఇదే విధంగా జరిగిన ప్రమాదంలో 158 మంది మృతిచెందారు. కొలికోడ్ ఘటనలో విమానానికి నిప్పు అంటుకోకపోవటంతో పెనుప్రమాదం తప్పిందని నిపుణులు విశ్లేషించారు. అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్ సాథె సమయస్ఫూర్తి వల్లే ఇది సంభవించిందని వారు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.