ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి

అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌........

Updated : 01 Sep 2020 12:53 IST

దిల్లీ: అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అంతకుమందు రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ప్రణబ్‌కు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, భాజపా నేత జ్యోతిరాధిత్య సింధియా, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సహా పలు పార్టీలకు చెందిన నాయకులు, ఇతర ప్రముఖులు ప్రణబ్‌ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మరికొందరు ప్రముఖులు సైతం ప్రణబ్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.

అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ప్రణబ్‌ ముఖర్జీ పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు.తదనంతరం గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రణబ్‌ భౌతికకాయాన్ని శ్మశాన వాటికకు తరలించనున్నారు. గన్‌ క్యారేజీపై కాకుండా సాధారణ అంబులెన్సులో శ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా సురక్షిత దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు