370 రద్దు బాధిస్తూనే ఉంది: ముఫ్తీ

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ( పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ 14 నెలల నిర్బంధం అనంతరం ఎట్టకేలకు విడుదలయ్యారు.

Published : 14 Oct 2020 12:20 IST

నిర్బంధం నుంచి విముక్తి

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ 14 నెలల నిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదలయ్యారు. ఆ వెంటనే ఆమె ట్విటర్ వేదికగా రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం బ్లాక్‌డే నాడు బ్లాక్‌ డెసిషన్‌ తీసుకుందని ప్రజలకు సందేశం పంపించారు. 

‘ఒక సంవత్సరం తరవాత నేను నిర్బంధం నుంచి విడుదలయ్యాను. నేను నిర్బంధంలో ఉన్నప్పుడు 2019 ఆగస్టులో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం (బ్లాక్‌ డెసిషన్) నా గుండెలపై దాడి చేస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రజల పరిస్థితీ ఇలాగే ఉంటుందని భావిస్తున్నాను. ఆ రోజు జరిగిందాన్ని ఎవరూ మర్చిపోలేరు. మనం పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకోవాలి. కశ్మీర్ కోసం మన పోరాటాన్ని కొనసాగించాలి. అదంత సులభం కాదని నాకు తెలుసు’ అంటూ కేంద్రం చర్యను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. నల్లటి బ్యాంగ్రౌండ్‌తో ఆడియో సందేశాన్ని పోస్ట్‌ చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

గత ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించడానికి కొన్ని గంటల ముందు ముఫ్తీని ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెపై కఠినమైన ‘ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద అభియోగాలు మోపారు. నిర్బంధాన్ని పొడిగించారు. ఎనిమిది నెలలపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనే ఆమెను ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న తన అధికారిక నివాసానికి మార్చి.. గృహ నిర్బంధం విధించారు. ముఫ్తీ నిర్బంధంపై ఆమె కుమార్తె ఇల్తిజా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. చివరగా దానిపై గత నెల 29న సర్వోన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని