ముంబయి మెట్రో రైలు సర్వీసులకు పచ్చజెండా

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రద్దయిన మెట్రో సర్వీసులు పునః ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ముంబయిలో మెట్రో రైళ్లు పట్టాలెక్కించనున్నట్లు.......

Updated : 24 Nov 2022 12:44 IST

ముంబయి: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రద్దయిన మెట్రో సర్వీసులు పునః ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 15నుంచి ముంబయిలో మెట్రో రైళ్లను దశల వారీగా పట్టాలెక్కించేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలను తెరిచే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెట్రో రైళ్ల సర్వీసులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, రేపటి నుంచే ప్రభుత్వ, ప్రైవేటు గ్రంథాలయాలను తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మెట్రో రైళ్లకు అనుమతించిన ప్రభుత్వానికి ముంబయి మెట్రో కృతజ్ఞతలు తెలిపింది. ఈ నెల 19న (సోమవారం) ఉదయం 8.30గంటల నుంచి ప్రయాణికులకు సేవలందించనున్నట్టు ట్విటర్‌లో వెల్లడించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్ల సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు ఆరు నెలలకు పైగా మెట్రో రైళ్ల సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. సెప్టెంబర్‌ తొలి వారం నుంచి మెట్రో రైళ్ల సర్వీసులకు కేంద్రం అనుమతించినప్పటికీ దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో మహారాష్ట్రలో మెట్రో రైళ్లు పట్టాలెక్కలేదు. తాజా నిర్ణయంతో మెట్రో పరుగులు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని