భారత్‌లో కరోనా.. 35 రోజులుగా అదే ట్రెండ్‌!

దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కోరల్లోంచి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం ...........

Updated : 07 Nov 2020 15:55 IST

కొత్త కేసుల కన్నా కోలుకున్నవారే అధికం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కోరల్లోంచి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం సానుకూలాంశంగా ఉంది. గత 24గంటల్లో 50,356 కొత్త కేసులు రాగా.. 53,920 మంది కోలుకొని డిశ్ఛార్జి కావడం గమనార్హం. దాదాపు గత ఐదు వారాలుగా దేశంలో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లో క్రియాశీల కేసుల్లో (యాక్టివ్‌ కేసులు) తగ్గుదల కనబడుతున్నట్టు పేర్కొంది. అక్టోబర్‌ తొలి వారం నాటికి దేశంలో సగటున 73వేల కేసులు ఉన్నప్పటికీ ఆ సంఖ్య 46వేలకు తగ్గుతూ వచ్చింది. కానీ శుక్రవారం మళ్లీ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,16,632కి చేరింది. 


ఆ 18చోట్లే రికవరీ రేటు అధికం!

గడిచిన 24గంటల్లో వైరస్‌ నుంచి కోలుకున్నవారిలో 79శాతం మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 11,060 మంది కోలుకోవడంతో అక్కడ ఇప్పటిదాకా రికవరీ అయినవారి సంఖ్య 15,62,342కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (7854), దిల్లీ (6121) ఉన్నాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు  92.41%గా ఉండగా.. 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా అధికంగా రికవరీ రేటు ఉండటం విశేషం. 


కొత్త కేసుల కలకలం ఈ మూడుచోట్లే..!

దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో దిల్లీ, కేరళ, మహారాష్ట్రలలోనే అధికం. గతంలో దిల్లీ, కేరళలో కేసుల సంఖ్య చాలా పరిమితంగానే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలో నిన్న 7178 కొత్త కేసులు రాగా.. కేరళలో 7002, మహారాష్ట్రలో 6870 చొప్పున వచ్చాయి.  నిన్న ఒక్కరోజు నమోదైన మొత్తం కేసుల్లో 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, నిన్న 577 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో అధికంగా నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 


గత 24గంటల్లో నమోదైన మరణాల్లో (577) 83శాతం మంది కేవలం 10 రాష్ట్రాల నుంచే ఉండటం అక్కడి తీవ్రతకు నిదర్శనం. కొత్తగా  మహారాష్ట్రలో అత్యధికంగా 161మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత దిల్లీలో 64మంది, బెంగాల్‌లో 55 మందిచొప్పున మృతి చెందారు.


దేశంలో కరోనా పరిస్థితి ఇలా..

భారత్‌లో ఇప్పటివరకు 84,62,080 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 78,19,886 (92.41%) కోలుకోగా 1,25,562 (1.48%) ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,16,632 (6.11%) క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, దేశంలో కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచుతున్నారు. నవంబర్‌ 6న 11,13,209 శాంపిల్స్‌ను పరీక్షించగా.. దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటిదాకా 11,65,42,304 శాంపిల్స్‌ టెస్ట్‌లు చేసినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ వ్యూహంతో వైరస్‌ కట్టడికి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని