కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు

కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజానీకానికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడుతోంది. మహమ్మారితో బాధపడుతున్న వారికి డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్‌ వ్యాధులు సోకుతున్నట్లు దిల్లీ వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో చేరిన వారికి కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధుల లక్షణాలు కనిపించడంతో...

Published : 06 Sep 2020 10:36 IST

దిల్లీ: కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాధితులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడుతోంది. మహమ్మారితో బాధపడుతున్న వారికి డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు సోకుతున్నట్లు దిల్లీ వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో చేరిన వారికి కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధుల లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేస్తే వారిలో చాలా మందికి కరోనాతోపాటు మలేరియా లేదా డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.

దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 30 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బాధపడుతుండగా.. విపరీతమైన జ్వరం రావడంతో డెంగ్యూ పరీక్ష నిర్వహించారు. దీనిలో అతడికి పాజిటివ్‌ తేలింది.  మరో 16 ఏళ్ల యువకుడికి కొవిడ్‌-19తోపాటు, మలేరియా పాజిటివ్‌ వచ్చింది. ఇలా ఒకే వ్యక్తికి రెండు వ్యాధులు నిర్ధారణ కావడంతో చికిత్స అందించేందుకు వైద్యులు సతమతమవుతున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని దిల్లీ ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రగ్యాన్‌ ఆచార్య తెలిపారు.

‘‘దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని తెలుసు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారిలో చాలా మందికి కరోనాతోపాటు డెంగ్యూ లేదా మలేరియా పాజిటివ్‌ వస్తోంది’’ అని సీనియర్‌ డాక్టర్‌ ఒకరు చెప్పారు. మరికొందరిలో డెంగ్యూ, మలేరియా రెండూ గుర్తించినట్లు చెప్పారు. దీనిపై పరిశోధనలు జరుపుతున్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ప్రగ్యాన్‌ ఆచార్య అన్నారు. అయితే, కరోనా వచ్చిన వారందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని కచ్చితంగా చెప్పలేమని, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వీటికి ఎప్పటిలాగేనే చికిత్స అందించాలని ఆయన వైద్యులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని