‘16 నుంచి కొవిడ్‌ టెస్ట్‌లకు డబ్బు చెల్లించాల్సిందే’

కరోనా టెస్ట్‌ల విషయంలో మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16నుంచి రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా కొవిడ్‌ టెస్ట్‌లు చేయలేమని తేల్చి చెప్పింది. టెస్టింగ్ కిట్లపై ఇచ్చిన సబ్సిడీని ఐసీఎంఆర్‌ ఉపసంహరించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు............

Published : 08 Oct 2020 02:03 IST

మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్‌: కరోనా టెస్ట్‌ల విషయంలో మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా కొవిడ్‌ టెస్ట్‌లు చేయలేమని తేల్చి చెప్పింది. టెస్టింగ్ కిట్లపై ఇచ్చిన సబ్సిడీని ఐసీఎంఆర్‌ ఉపసంహరించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ టిన్సాంగ్ ప్రకటించారు. తాజా నిర్ణయంతో వచ్చే వారం నుంచి కొవిడ్‌ పరీక్షలు చేయించుకొనేవారు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అది ఆర్‌టీ- పీసీఆర్‌ అయినా, సీబీనాట్‌.. ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌.. దేనికైనా ఛార్జీలు వసూలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రభుత్వ కరోనా కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న రోగులకు అందించే భోజనాలపై ఛార్జీలు వసూలు చేసే అంశంపైనా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, అతిథి గృహాలను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించిన లబ్ధిదారులు, హైరిస్క్‌ కాంటాక్ట్స్‌కు మాత్రం మొత్తంగా మినహాయింపు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

పర్యాటకులతో పాటు అందరికీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరమని, దీనికోసం రూ.500 వసూలు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, ట్రూనాట్‌, ఆర్‌టీ పీసీఆర్‌ సీబీనాట్‌ పరీక్షలకు మాత్రం గరిష్ఠ ఛార్జీ రూ.3200గా నిర్ణయించారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన వారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న 72 గంటల్లోపు ధ్రువీకరణ పత్రాలు చూపిస్తే మినహాయింపు పొందవచ్చని తెలిపారు. బయటి నుంచి మేఘాలయాకు వస్తున్న ప్రజలు www.coronameg.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కరోనా కేర్‌ సెంటర్లలో ఉన్న ఒక్కో వ్యక్తికి అందిస్తున్న ఆహారానికి సంబంధించి ఛార్జీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని