మీడియాపై ఆ చట్టం ప్రభావం ఉండదు: విజయన్‌

కేరళ ప్రభుత్వం పోలీస్‌ చట్టంలో చేసిన సవరణలు జర్నలిజానికి, స్వేచ్ఛాయుత ప్రసంగాలకు ఎలాంటి భంగం కలిగించవని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ చట్టంపై గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పలువురు ప్రతిపక్షపార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 23 Nov 2020 00:43 IST

కొచ్చి: కేరళ ప్రభుత్వం పోలీస్‌ చట్టంలో చేసిన సవరణలు జర్నలిజానికి, స్వేచ్ఛాయుత ప్రసంగాలకు ఎలాంటి భంగం కలిగించవని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ చట్టంపై గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఆదివారం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పలువురు ప్రతిపక్షపార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విజయన్‌ దాని గురించి వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడే బాధ్యతకు అనుగుణంగానే పోలీసు చట్టంలో ఈ సవరణలు తీసుకువచ్చాం. దీని వల్ల మీడియాపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎవరైనా ప్రభుత్వంపైన విమర్శలు చేయొచ్చు.. కానీ అది రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలి. స్వేచ్చాయుత ప్రసంగానికి, లేదా నిష్పక్షికంగా ఉండే జర్నలిజంపై ఈ చట్ట సవరణలు ఉపయోగించడానికి వీలు ఉండదు. పత్రికా స్వేచ్ఛ కల్పిస్తూనే వ్యక్తుల వ్యక్తిగత గౌరవాన్ని సైతం కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని విజయన్‌ ప్రకటనలో పేర్కొన్నారు.  

కేరళ పోలీసు సవరణ చట్టానికి గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఆదివారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా మహిళలు లేదా ఇతరులపై తప్పుడు, అసభ్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తే శిక్షార్హులుగా పరిగణించబడతారు. వారిపై మూడేళ్ల జైలు శిక్ష లేదా, రూ.10వేల జరిమానా విధించబడుతుంది. కాగా కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకించారు. ఈ నిర్ణయం స్వేచ్ఛాయుత ప్రసంగానికి వ్యతిరేకమని విమర్శించారు. కేరళ ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం తీసుకున్న పోలీసు సవరణ చట్టం నిర్ణయంపై దిగ్బ్రాంతికి గురయ్యాయనని కాంగ్రెస్‌ నేత పి చిదంబరం అన్నారు. ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. ‘ఈ చట్టం రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, విమర్శకులకు వ్యతిరేకంగా ఉపయోగించేవిధంగా తయారుచేశారు’ అని ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని