ఆ సమాచారం బయటకు చెప్పొద్దు: ఓం బిర్లా

పార్లమెంట్‌ స్థాయీ సంఘ సమావేశాల సమాచారం బయటకు రావడం, మీడియాలో కథనాలు వస్తుండటంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విస్మయం వ్యక్తం చేశారు...

Published : 26 Aug 2020 13:51 IST

దిల్లీ: పార్లమెంట్‌ స్థాయీ సంఘ సమావేశాల సమాచారం బయటకు రావడం, మీడియాలో కథనాలు వస్తుండటంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విస్మయం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నివేదిక ప్రవేశపెట్టే ముందే అన్ని విషయాలు బయటకు రాకుండా దృష్టి సారించాలని అన్ని కమిటీల ఛైర్మన్‌లను స్పీకర్‌ కోరారు. ఈమేరకు కమిటీల ఛైర్మన్‌లకు ఓం బిర్లా లేఖ రాశారు.

 పార్లమెంటరీ కమిటీల చర్చలు, విషయాలు గోప్యంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కమిటీ నివేదికలు పార్లమెంట్‌లో టేబుల్‌ చేసే వరకు సభ్యులు కమిటీల్లో  జరిగే చర్చల వివరాలు మీడియాకు చెప్పకూడదని లేఖలో పేర్కొన్నారు. రూల్‌ 270 ప్రకారం సబ్జెక్టుల ఎంపిక సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రూల్‌ 270 ప్రకారం... ఎవరైనా పత్రం లేదా రికార్డును పరిశీలించే విషయంలో స్పీకర్‌ అభిప్రాయం తీసుకోవాలని, ఆవిషయాల్లో స్పీకర్‌ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారం కోర్టులలో పెండింగ్‌లో ఉన్న విషయాలను కమిటీలు చర్చకు తీసుకోవద్దని పేర్కొన్నారు. 

 భవిష్యత్‌ కమిటీల సమావేశాలలో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటరీ కమిటీల సభ్యులందరూ దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని, ఆవిధంగా చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వివాదంపై పార్లమెంట కమిటీలో ..ఫేస్‌బుక్‌ అధికారులను కమిటీ ఛైర్మన్‌ శశిథరూర్‌ సమన్‌ చేయడంపై వివాదమేర్పడింది. ఐటీ  పార్లమెంటరీ కమిటీకి ఫేస్‌బుక్‌ అధికారులను పిలిపించిన వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు భాజపా సభ్యులు నిషికాంత్‌ దుబే, రాజ్యవర్థన్‌రాఠోడ్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని