కుల్‌భూషణ్‌ కేసులో పాక్‌ కీలక నిర్ణయం!

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషన్‌ జాదవ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పాక్‌ మిలిటరీ కోర్టు జాదవ్‌కు విధించిన శిక్షపై సమీక్షించే బిల్లును పాకిస్థాన్‌ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం సూచనల మేరకు పాక్‌ ప్రభుత్వం ఈ బిల్లును

Published : 22 Oct 2020 19:37 IST

ఇస్లామాబాద్‌: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పాక్‌ మిలిటరీ కోర్టు జాదవ్‌కు విధించిన శిక్షపై సమీక్షించడానికి సహకరించే బిల్లును పాకిస్థాన్‌ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం సూచనల మేరకు పాక్‌ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు ఆ దేశ న్యాయశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాల్ని పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ న్యాయ శాఖ మంత్రి నసీమ్‌ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ న్యాయస్థానం సూచనల మేరకు జాదవ్‌కు విధించిన శిక్షపై సమీక్ష కోరే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాం. దీనికి పార్లమెంటరీ కమిటీ నుంచి ఆమోదం లభించింది. ఈ చట్టం ద్వారా శిక్షకు వ్యతిరేకంగా జాదవ్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’నసీమ్‌ తెలిపారు. కాగా ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందకపోతే ఐసీజే తీర్పును ఖాతరు చేయని కారణంగా పాక్‌ ఆంక్షల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నసీమ్‌ హెచ్చరించారు. తొలుత పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. కమిటీ ఛైర్మన్‌ ఓటింగ్‌ ద్వారా బిల్లును ఆమోదించారు. 

2016లో ఇరాన్‌ నుంచి కుల్‌భూషణ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. అనంతరం గూఢచర్యం ఆరోపణల మోపడంతో పాక్‌ మిలిటరీ కోర్టు జాదవ్‌కు 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీంతో ఆ శిక్షను సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2017 మే 18న కోర్టు మరణశిక్షపై స్టే విధించింది. రెండు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలిపివేస్తూ 2019 జులై 17న తీర్పు ఇచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని