అలా చేస్తే రాక్షసుడికి ఆహారం పంపినట్లే!

పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచ దేశాల ముందు భారత్‌ మరోసారి ఎండగట్టింది. పాక్‌  ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణ ఆసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని పోత్రహిస్తోందని ఐక్యరాజ్య సమితి...

Updated : 03 Dec 2020 17:40 IST

పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన భారత్‌

న్యూయర్క్‌: పాకిస్థాన్‌ తీరును ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ మరోసారి బయటపెట్టింది. పాక్‌  ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపన జరుగుతుందని పునరుద్ఘాటించింది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సాధారణ‌ అసెంబ్లీలో ‘ కల్చర్‌ ఆఫ్‌ పీస్‌’ అనే అంశంపై  జరిగిన చర్చలో సమితి శాశ్వత మిషన్‌లో భారత తరఫున తొలి కార్యదర్శి ఆశిష్‌ శర్మ ప్రసంగించారు.  ప్రస్తుత ప్రపంచంలో అసహనం, ద్వేషం, హింస,ఉగ్రవాదం దాదాపు ఓ నియమంగా మారిపోయాయని అన్నారు. హింసను ప్రేరేపించడంలో ఉగ్రవాదం కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా ఆశిష్‌ శర్మ అన్నారు.

‘‘ పాకిస్థాన్‌ మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే దక్షిణాసియా దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించగలం’’ అని ఆయన ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో పేర్కొన్నారు. భారత్‌లోని కొందర్ని పావులుగా వాడుకొని పాక్‌ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ దేశంలోని మైనార్టీలపైనా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతోందన్నారు. ఉగ్రవాదాన్ని పోత్సహించడం లేదా చూసీ చూడనట్లు వ్యవహరించడమనేది రాక్షసుడికి ఆహారం పంపిస్తున్నట్లేనని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలని,  దీనిపట్ల పాకిస్థాన్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరిగా ప్రయత్నించి ఓడిపోవడం కంటే.. అందరూ కలిసి పోరాడి శాంతి సంస్కృతిని స్థాపించాలని భారత్‌ కోరింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని