క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

కరోనా నివారణ కోసం ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతా సానుకూలంగా జరిగితే కిస్మస్‌ కంటే ముందే టీకా

Updated : 19 Nov 2020 13:23 IST

ఏడాది చివరి నాటికి 5 కోట్ల డోసులు లక్ష్యం

న్యూయార్క్‌‌: కరోనా నివారణ కోసం ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతా సానుకూలంగా జరిగితే కిస్మస్‌ కంటే ముందే టీకా పంపిణీ ప్రారంభిస్తామని బయోఎన్‌టెక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉగర్‌ సహిన్ వెల్లడించినట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. 

టీకా ప్రయోగాలు పూర్తయినట్లు ఫైజర్‌, బయో ఎన్‌టెక్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయోగాల్లో దీని సామర్థ్యం 95 శాతం వరకు ఉందని తేలినట్లు సంస్థలు వెల్లడించాయి. అత్యవసర అనుమతుల కోసం అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ), యూరోపియన్‌ యూనియన్‌కు దరఖాస్తు చేసినట్లు ఉగర్‌ సహిన్‌ తెలిపారు. ‘అంతా బాగా జరిగితే డిసెంబరు రెండో అర్ధభాగంలో అనుమతులు రావొచ్చని భావిస్తున్నాం. క్రిస్మస్‌కు ముందే టీకా పంపిణీ మొదలుపెడతాం. అయితే అంతా సానుకూలంగా జరిగితేనే’ అని సహిన్‌ మీడియాతో అన్నారు. 

ఈ ఏడాది చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేస్తామని ఫైజర్‌ వెల్లడించింది. వీటి వల్ల 2.5 కోట్ల మందిని కరోనా నుంచి రక్షించొచ్చని పేర్కొంది. అలాగే 2021 నాటికి 13 కోట్ల డోసులు తయారుచేస్తామని సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది టీకా పంపిణీ కోసం ఇప్పటికే బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌, యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు ఫైజర్‌ తెలిపింది. 

ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాల్సిన అవసరం ఉండటంతో టీకా రవాణా కాస్త సంక్లిష్టంగా మారింది. అయితే దీన్ని సాధారణ రిఫ్రిజిరేషన్‌లో ఐదు రోజుల వరకు, థర్మల్‌ షిప్పింగ్‌ బాక్సుల్లో 15 రోజుల వరకు ఉంచొచ్చని కంపెనీ చెబుతోంది. రవాణా సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంచేందుకు డ్రై ఐఎస్‌ను ఉపయోగిస్తామని తెలిపింది. 

ఇదీ చదవండి..

ఫైజర్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 95%


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని