మోడెర్నా, ఫైజర్‌ కంటే తక్కువ ధరలోనే..!

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ధర, ఇదివరకే వెల్లడించిన మోడెర్నా, ఫైజర్‌ టీకాల కంటే చాలా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

Published : 22 Nov 2020 22:03 IST

వెల్లడించిన స్పుత్నిక్‌ టీకా తయారీదారులు

ఇంటర్నెట్డెస్క్‌: రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ధర, ఇదివరకే వెల్లడించిన మోడెర్నా, ఫైజర్‌ టీకాల కంటే చాలా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా స్పుత్నిక్‌-వి తయారీదారులు వెల్లడించారు. ‘ఫైజర్‌ టీకా ధర 19.50 డాలర్లు కాగా మోడెర్నా ధర 25-37 డాలర్లు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవి రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీటి ధర 39డాలర్లు, 50-74డాలర్లు అవుతుంది. అయితే, స్పుత్నిక్‌-వి టీకా ధర మాత్రం ఈ రెండింటి కంటే చాలా తక్కువగానే ఉంటుంది’ అని స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రూపకర్తలు ప్రకటించారు. అయితే, కచ్చితంగా ఎంత ఉంటుందని మాత్రం వెల్లడించలేదు.ఇక గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌(కొవిషీల్డ్‌) ధర రూ.500-600కే అందుబాటులో ఉండనుందని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధర్‌ పూనావాలా ఈమధ్యే వెల్లడించారు. రెండు డోసుల ధర వెయ్యి నుంచి రూ 1200 వరకు ఉంటుందని తెలిపారు.

ఇదిలాఉంటే, రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అక్కడి ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు నెలలో రిజిస్టర్‌ చేసుకున్న స్పుత్నిక్‌ టీకా యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా మూడో దశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ 92శాతం సమర్థత కనబరిచినట్లు మధ్యంతర ఫలితాలను ఈ(నవంబర్‌) నెలలోనే ప్రకటించింది. మరో ముందడుగు వేసిన స్పుత్నిక్‌ మిగతా టీకాల కంటే తమది చాలా తక్కువ ధర ఉంటుందని మరోసారి ఆసక్తికర ప్రకటన చేసింది. ఇక మోడెర్నా తయారుచేసిన టీకా 94.5శాతం సమర్థత కలిగినట్లు ప్రకటించగా ఫైజర్‌ మాత్రం 95శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. మరో అడుగు ముందుకు వేసిన ఫైజర్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని