ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌(99) కన్నుమూశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుప్రతిలో

Updated : 09 Apr 2021 20:19 IST


లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌(99) కన్నుమూశారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరిన విషయం తెలిసిందే. అయితే గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. విండ్సర్‌ క్యాస్టిల్‌లో ఈ ఉదయం ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు పేర్కొంది. 

గ్రీకు రాకుమారుడైన ఫిలిప్‌ 1947లో ఎలిజెబెత్‌ను వివాహం చేసుకుని బ్రిటన్‌ రాజ్యానికి వచ్చారు. అప్పటి నుంచి రాణి వెన్నంటి ఉంటూ పాలనపరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 2017లో రాచరికపు విధుల నుంచి రిటైర్‌ అయ్యారు. ‘నా భర్తే నాకు కొండంత బలం’ అని 1997లో తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాణి ఎలిజెబెత్‌ తన ప్రసంగంలో తెలిపారు.

అయితే గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. నాలుగు వారాల చికిత్స తర్వాత మార్చి 16న డిశ్చార్జ్‌ అయ్యారు. 

ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని