నిరసనల పేరిట రోడ్లను ఆక్రమించొద్దు

బహిరంగ ప్రదేశాలు, రోడ్లను నిరవధికంగా మూసివేసి నిరసనలు తెలపడం ఏమాత్రం ఆమోదనీయం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో చేపట్టిన నిరసనలను ఉద్దేశిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది..............

Updated : 07 Oct 2020 13:02 IST

షాహీన్‌బాగ్‌ ఆందోళనపై సుప్రీంకోర్టు

దిల్లీ: బహిరంగ ప్రదేశాలు, రోడ్లను నిరవధికంగా మూసివేసి నిరసనలు తెలపడం ఏమాత్రం ఆమోదనీయం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో చేపట్టిన నిరసనలను ఉద్దేశిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిరసనలు తెలిపే హక్కు ఇతర హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, నిరసన రెండూ సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిరసనల విషయంలో సంబంధిత అధికారులు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో గత డిసెంబరులో ప్రారంభమైన నిరసనలు దాదాపు మూడు నెలల పాటు కొనసాగాయి. నిరసనలకు ఆ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారడంతో దిల్లీలోని జామియా నుంచి నోయిడాకు వెళ్లే రహదారిలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడం గమనార్హం. ఈ క్రమంలో నిరసనల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుండడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పట్లోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు చేయవచ్చని పేర్కొంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించింది. తదనంతర పరిణామాల్లో దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తుండడంతో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో నిరసనకారులు అక్కడి నుంచి క్రమంగా నిష్క్రమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని