అదిగో రఫేల్‌ రివ్వునెగిరే..!

భారత వాయుసేన అమ్ములపొదిలే చేరేందుకు ఫ్రాన్స్‌ నుంచి  ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు సోమవారం బయల్దేరాయి. ఈ విషయాన్ని వాయుసేన ట్విటర్‌లో పంచుకొంది. ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ నుంచి రెండు దశల్లో సాగే ఈ ప్రయాణానికి ఫ్రాన్స్‌ వాయుసేనకు చెందిన ట్యాంకర్‌ విమానం కూడా అండగా రానుంది.

Updated : 27 Jul 2020 15:43 IST

 ఫ్రాన్స్‌ నుంచి అంబాలాకు బయల్దేరిన యుద్ధవిమానాలు 

 మరో రెండు రోజుల్లో భారత్‌కు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత వాయుసేన అమ్ములపొదిలో చేరేందుకు ఫ్రాన్స్‌ నుంచి  ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు సోమవారం బయల్దేరాయి. ఈ విషయాన్ని వాయుసేన ట్విటర్‌లో పంచుకొంది. ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ నుంచి రెండు దశల్లో సాగే ఈ ప్రయాణానికి ఫ్రాన్స్‌ వాయుసేనకు చెందిన ట్యాంకర్‌ విమానం కూడా అండగా రానుంది. అవసరమైనప్పుడు గాల్లోనే ఇంధనం నింపుకొని ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. ఈ విమానాలు 29వ తేదీన అంబాలాలోని ‘గోల్డెన్‌ యారోస్‌’ స్క్వాడ్రన్ స్థావరానికి చేరనున్నాయి. అంటే ఇప్పటి వరకు విశ్రాంతిలో ఉన్న గోల్డెన్‌ యారోస్‌ ఇప్పుడు రఫేల్స్‌పై రంగంలోకి దిగనుంది. 

ప్రయాణం ఇలా..

ఫ్రాన్స్‌లో డసో ఏవియేషన్‌ ఉన్న మెరిగ్నాక్‌ నుంచి బయల్దేరి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఫ్రాన్స్‌వైమానిక స్థావరమైన అల్‌ డర్ఫాకు చేరనున్నాయి. ఇందుకు దాదాపు 10 గంటల సమయం పట్టనుంది.  మొత్తం ప్రయాణంలో మార్గం మధ్యలో ట్యాంకర్‌ విమానం సాయంతో రెండుసార్లు గాల్లోనే ఇంధనం నింపుకొంటారు. రాత్రి మొత్తం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో గడిపాక భారత్‌లోనే అంబాలా ఎయిర్‌బేస్‌కు బయల్దేరతాయి. 

వారంలోనే యుద్ధక్షేత్రానికి..

అంబాలా క్షేత్రానికి చేరిన వారం లోపే వీటిని ఆపరేషన్స్‌లోకి దించే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో వీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ఆరునెలలు పడుతుంది. కానీ, ప్రస్తుతం అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే వినియోగానికి తెస్తున్నారు. ఇప్పటికే 12 మంది వాయుసేన పైలట్లు ఫ్రాన్స్‌లో ఈ విమానాలను నడపడాన్ని నేర్చుకొన్నారు. ఈ విమానాలతో చైనాపై స్పష్టమైన ఆధిక్యం భారత్‌కు లభిస్తుంది. మరో 18 మంది వీటిపై  ఫ్రాన్స్‌లో శిక్షణ పొందనున్నారు. 

వీటికి అనుబంధంగా హ్యామర్లు 

రఫేల్‌ పూర్తిస్థాయి ఆయుధ  వ్యవస్థ అక్టోబర్‌లో భారత్‌కు చేరనుంది. క్షిపణుల్లో కొన్ని మాత్రం ఇప్పటికే అంబాలాకు చేరుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిల్లో అత్యంత శక్తివంతమైన మెటియోర్‌ క్షిపణలు ఉన్నాయి. ఒక్కోటి రూ. 20 కోట్లు విలువ చేసే ఈ క్షిపణి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా తాకుతుంది. వీటిలోపాటు స్కాల్ప్‌ క్షిపణులను కూడా వినియోగించనున్నారు. ఇవి 1300 కేజీల బరువు ఉండటంతో ఒక్కో విమానంపై రెండు మాత్రమే అమర్చవచ్చు. 
మరోపక్క భూమిపై లక్ష్యాలను ఛేదించే హ్యామర్‌ క్షిపణులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్రాన్స్‌లోనే తయారు చేస్తుండటంతో ఈ విమానాలపై వినియోగించడం తేలికవుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని